యాదాద్రి, జూన్10: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం గురువారం పసిడి వర్ణపు కాంతులతో స్వర్ణ దేవాలయా న్ని తలపించింది. బెంగళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీ సంస్థలో ప్రత్యేకంగా తయారు చేసిన విద్యుద్దీపాలను ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి ఆలయానికి బిగించి ట్రయల్ రన్ నిర్వహించారు. యాదాద్రి ఆలయం పూర్తిగా బంగారు వర్ణాన్ని సంతరించుకుని మహాద్భుతంగా దర్శనమిచ్చింది. యాదాద్రి ప్రధానాలయంలో ప్రథమ, ద్వితీయ ప్రాకారాలు, యాలీ పిల్లర్లకు లైటింగ్ను బిగించి పరిశీలించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రపంచంలో ఏ ఆలయానికి వినియోగించని విధంగా ప్రత్యేకంగా రూపొందించిన విద్యుద్దీపాలను యాదాద్రి ఆలయానికి వినియోగిస్తున్నట్లు ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి తెలిపారు. ప్రత్యేకంగా తయారు చేసిన విద్యు ద్దీపాలకు అమెరికా, రష్యన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు తెలిపారు. కృష్ణశిలలతో నిర్మించిన యాదాద్రి ఆలయం ప్రత్యేకంగా ఉండాలన్న సంకల్పంతో బంగారు, పసుపు వర్ణపు కాంతిని వెదజల్లేలా తయారు చేశామన్నారు. వీటిని రూపకల్పన చేసేందుకు రెండేండ్ల సమయం పట్టిందన్నారు. ప్రతిరోజూ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఇక్కడే ఉండి విద్యుద్దీపాల వెలుగులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ట్రయల్ రన్ తుదిదశకు చేరుకుందని, వచ్చే శనివారం టెక్నికల్ కమిటీ పర్యవేక్షణలో పూర్తిస్థాయిలో ట్రయల్ రన్ నిర్వహించి, తుది పనులు పూర్తి చేస్తామన్నారు. ఆయన వెంట వైటీడీఏ డీఈ రామారావు, వైటీడీఏ అధికారులు పాల్గొన్నారు.