పేషెంట్లకు మెరుగైన వైద్యం అందేలా చూస్తాం
నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం..
ప్రజలు స్వీయనియంత్రణ, రక్షణ చర్యలు పాటించాలి..
అందుబాటులో బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు..
విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దివాకర్రావు, కోనప్ప, ఆత్రం సక్కు
మంచిర్యాలటౌన్, మే 10: కరోనా రెండో వేవ్ ఉధృతంగా ఉన్నదని, దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతున్నదని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. మంచిర్యాలలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం మంచిర్యాల, సిర్పూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, కోనేరు కోనప్ప, ఆత్రం సక్కులతో కలిసి మాట్లాడారు. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కొవిడ్ వ్యాప్తి, తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలు, వాస్తవ పరిస్థితులను తెలుసుకొని తగిన పరిష్కార మార్గాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. తాను ఈ రెండు జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో చర్చించానన్నారు. తాను కూడా పలు వైద్యశాలలకు వెళ్లానని, డాక్టర్లు, ప్రజలు, బాధితులతో మాట్లాడానని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో అందరూ సహకరించాలని, ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. స్వల్ప లక్షణాలతో దవాఖానలకు వచ్చిన బాధితులకు సత్వరమే వైద్యం అందించాలని, అందుబాటులో ఉన్న ఐసొలేషన్ సెంటర్లకు వెళ్లాలని సూచించారు. మంచిర్యాలలోని క్లబ్లో 100 పడకల ఐసొలేషన్ కేంద్రంలో కేవలం ముగ్గురు మాత్రమే ఉంటున్నారని, బెల్లంపల్లిలోని కొవిడ్ వైద్యశాలలో 150 పడకలు ఉం డగా 60 నుంచి 70 మంది మాత్రమే అక్కడ చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఇకనుంచి ప్రతి వైద్యశాలలో కొవిడ్ చికిత్స అందుతుందని తెలిపారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం టీఎస్ఎంఐడీసీచైర్మన్ చంద్రశేఖర్రెడ్డికి ఫోన్చేసి మాట్లాడినట్లు వివరించారు. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు టెస్టింగ్ కిట్లు , హోం ఐసొలేషన్ కిట్లు పెంచాలని, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను ప్రైవేట్ వైద్యశాలకు కూడా సరఫరా చేయాలని, ఆక్సిజన్ సిలిండర్లను మారుమూల మండలాల్లోని దవాఖానలకు సైతం పంపించాలని, అన్ని పీహెచ్సీల్లో ఆక్సీమీటర్లు, బీపీ చెకప్ పరికరాలు అందుబాటులో ఉంచాలని కోరామని వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ సమీపంలోని దవాఖానకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలని, ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వినియోగించుకోవాలన్నారు.
కరోనా పాజిటివ్ వస్తే భయ పడవద్దని సూచించారు. ప్రజలకు అండగా తెలంగాణ సర్కార్ ఉన్నదని, ఎలాంటి అపొహలు, భయాలకు గురికావద్దన్నారు. కొవిడ్ నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కష్టకాలంలో కూడా సం క్షేమ పథకాలను నిర్విరామంగా అమలుచేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని, రెండు నెలల పాటు రేషన్ బియ్యా న్ని ఉచితంగా ఇవ్వనున్నారని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్నంతా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెటం రాజయ్య, వైస్చైర్మన్ ముఖేశ్గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం తదితరులు పాల్గొన్నారు.