టెహ్రాన్: ఇరాన్ అమరవీరుల ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ కొత్త సుప్రీం నాయకుడు
మోజ్తాబా ఖమేనీ ప్రతిజ్ఞ చేశారు. (Mojtaba Khamenei) ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను మూసివేయాలని పిలుపునిచ్చారు. హార్ముజ్ జలసంధిని మూసేస్తామని స్పష్టం చేశారు. సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోజ్తాబా ఖమేనీ తొలిసారి బహిరంగ సందేశాన్ని గురువారం విడుదల చేశారు. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో అమెరికా, హార్ముజ్ జలసంధిపై కఠినమైన వైఖరిని ప్రస్తావించారు. ‘ఈ ప్రాంతంలోని అన్ని అమెరికా స్థావరాలను వెంటనే మూసివేయాలి, లేకపోతే వాటిపై దాడి కొనసాగుతుంది’ అని హెచ్చరించారు.
కాగా, దాడుల్లో గాయపడి ఇప్పటి వరకు బయటకు కనిపించని సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రకటనను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్లో ఒక ప్రెజెంటర్ వినిపించారు. హార్ముజ్ జలసంధి మూసివేత కొనసాగించాలని ఒక లెవరేజ్ సాధనంగా అది ఉండాలని ఆయన అన్నారు. పొరుగు దేశాల పట్ల ఇరాన్ విధానం సహకారంగా ఉంటుందని చెప్పడానికి ప్రయత్నించారు. ‘ప్రాంతీయ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలకు ఇరాన్ మద్దతు ఇస్తుంది. కానీ అమెరికన్ దళాలకు ఆతిథ్యం ఇవ్వకుండా వారిని హెచ్చరిస్తుంది’ అని పేర్కొన్నారు.
మరోవైపు ఇరానియన్ల రక్తానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తాము వెనుకాడబోమని మోజ్తాబా ఖమేనీ స్పష్టం చేశారు. స్కూల్పై క్షిపణి దాడిలో సుమారు 110 మంది పిల్లలతో సహా168 మంది మరణించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పోరాటాన్ని ఆయన ప్రశంసించారు. అలాగే లెబనాన్, ఇరాక్, యెమెన్తో సహా ఈ ప్రాంతంలోని మిత్ర సాయుధ సమూహాలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హతమయ్యారు. ఈ దాడుల్లో గాయపడిన ఆయన కుమారుడైన మోజ్తాబా ఖమేనీ తన తండ్రి అధికారాన్ని దక్కించుకున్నారు.
Also Read:
woman kills mother-in-law | ప్రియుడితో పట్టుబడిన కోడలు.. అత్తను చంపి గుండెపోటుగా నమ్మించేందుకు యత్నం