Paracetamol – Brown Tree Snakes | పారాసిటమాల్.. కరోనా ముందు ఏమోగానీ ఇప్పుడు మాత్రం ఈ ట్యాబ్లెట్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. కొవిడ్ పుణ్యమా అని ఇది ఒక పిప్పరమెంట్ బిల్లలా మారిపోయింది. ఇప్పుడు ఒంట్లో ఏ కాస్త నలతగా ఉన్న దీన్నే వాడుతున్నారు. అంతలా ఇది మనతో మమేకమైపోయింది. కానీ ఇదే ట్యాబ్లెట్ను పాములను చంపడానికి ఉపయోగిస్తున్నారని తెలుసా ! అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇది నిజమండీ బాబూ ! అగ్రరాజ్యం అమెరికాలో పాముల్ని చంపడానికి ఈ పారాసిటమాల్ ట్యాబ్లెట్లను వాడుతున్నారు. అసలు పారాసిటమాల్తో పాములను ఎలా చంపుతున్నారు? అయినా వన్యప్రాణులను సంరక్షించాల్సిందిపోయి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఒకసారి తెలుసుకుందాం..
అమెరికాలోని గువామ్ దీవిలో బ్రౌన్ ట్రీ జాతికి చెందిన పాములు అధికంగా ఉన్నాయి. ఈ పాములు ఒక్కొకటి మూడు మీటర్ల పొడవు ఉంటాయి. ఎక్కువగా చెట్లపైనే ఆవాసం ఉంటాయి. ఈ బ్రౌన్ ట్రీ స్నేక్స్ను చంపేందుకు ముందుగా చినిపోయిన ఎలుకలను సేకరిస్తున్నారు. వాటిలోకి 80 మిల్లీగ్రాముల చొప్పున పారాసిటమాల్ ఇంజెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని కార్డ్బోర్డ్ పారాచూట్లకు అతికించి హెలికాప్టర్ల ద్వారా అడవుల్లోకి వదిలేస్తున్నారు. ఆ పారాచూట్ల ద్వారా చనిపోయిన ఎలుకలు చెట్లపైకి చేరుతున్నాయి. సహజంగానే చెట్లపై ఉండే బ్రౌన్ ట్రీ స్నేక్స్.. ఆ ఎలుకలను తిని కొద్దిగంటల్లోనే చచ్చిపోతున్నాయి. మరి ఆ పాములు ఎలుకల్ని తిని మరణించాయా? లేదా తెలుసుకునేందుకు ఎలుకల్లో రేడియో ట్రాకర్లను కూడా అమరుస్తున్నారు. దీనికోసం ఏటా దాదాపు రూ.60 కోట్ల వరకు ఖర్చు చేస్తుంది.
గువామ్ దీవిలో బ్రౌన్ ట్రీ స్నేక్స్ విపరీతంగా ఉన్నాయి. ఈ దీవిలో దాదాపు 30 లక్షలకు పైగా బ్రౌన్ ట్రీ స్నేక్స్ ఉండొచ్చని అంచనా. వీటివల్ల ఆ చుట్టుపక్కల ఉన్న చాలా జాతుల వన్యప్రాణులు మనుగడ సాధించలేకపోతున్నాయి. ఈ పాముల వల్ల ఇప్పటికే గువామ్ దీవిలో ఉండే 9 జాతుల పక్షులు అంతరించిపోయాయి. తొండలు, గబ్బిలాల మనుగడ కూడా కష్టమైపోయింది. అంతేకాకుండా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల్లో పాములు చిక్కుకోవడం వల్ల తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. చాలా పరికరాలు దెబ్బతింటున్నాయి. దీంటో వాటి మరమ్మతుకు ఏటా 4 మిలియన్ డాలర్లకు పైగా నష్టం వస్తుందట. అందుకే బ్రౌన్ ట్రీ స్నేక్స్ సంఖ్యను తగ్గించేందుకు వాటిని చంపాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నిజానికి బ్రౌన్ ట్రీ స్నేక్స్ అమెరికాలోని గువామ్ దీవికి చెందినవి కాదు. దాదాపు 70 ఏండ్ల నుంచి మాత్రమే ఇవి ఇక్కడ ఉంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ జాతి పాములు అమెరికాకు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఆ సమయంలో గువామ్ దీవి అమెరికా సైనిక స్థావరంగా ఉండేది. కొంతకాలం ఈ స్థావరం జపాన్ ఆధీనంలో కూడా ఉంది. అప్పుడే సరుకు రవాణా ఓడల ద్వారా జపాన్ నుంచి ఈ పాము గువామ్ దీవికి చేరి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇలా ఇవి వేరే దేశం నుంచి రావడం వల్లే వీటి సంఖ్య ఇంతలా పెరిగిపోయింది. అదెలా అంటారా? సాధారణంగా ఒక జీవి మనుగడ సాధించాలంటే మరో జీవిపై ఆధారపడుతుంది. మొక్కలను సాధు జంతువులు తిని బతికితే.. వాటిని క్రూర మృగాలు తిని మనుగడ సాగిస్తాయి. ఒకవేళ అది జరగకపోతే జీవరాశుల సమతుల్యం దెబ్బతింటుంది.
అమెరికాలోని గువామ్ దీవిలో ఇప్పుడు అదే జరిగింది. బ్రౌన్ ట్రీ స్నేక్స్ తమ సహజ ఆవాస ప్రాంతంలో ఉండి ఉంటే.. వాటి శత్రు జంతువులకు ఆహారంగా మారిపోయేవి. దీంతో ఆ పాముల సంఖ్య నియంత్రణలో ఉండేది. కానీ ఈ పాములకు గువామ్ దీవి సహజ ఆవాస ప్రాంతం కాదు. దీంతో వాటికి అక్కడ శత్రువులు లేకుండా పోయాయి. అందువల్ల అక్కడ బ్రౌన్ ట్రీ స్నేక్స్ సంఖ్య పెరిగిపోయింది. 1950లో తొలిసారిగా బ్రౌన్ ట్రీ స్నేక్ ఇక్కడ కనిపించింది. ఆ తర్వాత 40 ఏండ్లలోనే ఇవి పెద్ద సమస్యగా మారిపోయాయి. అప్పటి నుంచి ఈ పాములను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఇందులో భాగంగానే పారాసిటమాల్తో వాటిని చంపుతున్నారు.
ఎక్కడి నుంచో గువామ్ దీవికి వచ్చిన బ్రౌన్ ట్రీ స్నేక్స్ వల్ల ఆ ప్రాంతం ఎంతగానో ఇబ్బంది పడుతుంది. ప్రస్తుతానికి అమెరికాలో ఈ ఒక్క దీవిలో మాత్రమే ఈ జాతి పాములు ఉన్నాయి. ఇవే పాములు మిగిలిన ప్రాంతాలకు చేరితే పరిస్థితులు తీవ్రంగా మారతాయి. అందుకే వీటి సంఖ్యను ఇక్కడికే పరిమితం చేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే చాలా పాములను పారాసిటమాల్తో చంపుతుంది. అయితే పాములను అంతరింపజేయడం తమ లక్ష్యం కాదని.. వాటి నియంత్రించేందుకు మాత్రమే ఈ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. కానీ వన్యప్రాణుల సంరక్షకులు మాత్రం ఈ చర్యను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Viral Video | తలకిందులుగా కట్టిన ఇల్లు.. వావ్.. సూపర్ అంటున్న పర్యాటకులు
బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మన శ్లోకాల కంటే పొడవైనది
జీరో బెడ్రూం హౌస్ ధర ఏకంగా రూ 14.66 కోట్లు పలికింది..ఎక్కడంటే!