వికారాబాద్, జూన్ 11, (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు గిట్టుబాటు ధర ఉండడంతో రైతులు తెల్లబంగారం వైపే మొగ్గు చూపుతున్నారు. పత్తి సాగు పెరిగేలా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణం 4,76,283 ఎకరాలు కాగా, 5,97,220 సాగవుతుందని అధికారుల అంచనా. ఇందులో పత్తి సాధారణ సాగు 2,13,192 ఎకరాలు కాగా, 2,73,963 ఎకరాలు సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తొలకరి పలకరింపుతో ..
ఇటీవల కురిసిన సాధారణ వర్షాలకు అన్నదాతలు సాగు పనుల్లో బిజీ అయ్యారు. దుక్కులు సిద్ధం చేసుకుని పత్తి సాళ్ల అచ్చులు కొట్టి పెట్టుకుంటున్నారు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి తదితర డివిజన్లలోని రైతులు కొన్ని చోట్ల పత్తి గింజలు విత్తారు. ఈసారి వరి సాగును తగ్గించి పత్తి సాగును పెంచేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. పత్తిలో కనీస దిగుబడి ఉంటుంది. వర్షాభావ పరిస్థితులను తట్టుకుంటుంది. మార్కెట్ భద్రత కూడా ఉంటుంది. సాగు ప్రణాళిక మేరకు విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.
పెరుగుతున్న అంచనాలు..
గతేడాది జిల్లాలో 2,11,192 పైగా పత్తి సాగైంది. ఈసారి 5,97,220 ఎకరాల్లో పత్తి సాగు కానున్నట్లు వ్యవసాయాధికారుల అంచనా. డివిజన్ల వారీగా 5వేల నుంచి 10వేల ఎకరాల వరకు అదనంగా సాగయ్యేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. గతేడాది పత్తి దిగుబడులు, ధరలు ఆశించిన మేర ఉండడంతో ఈ సంవత్సరం రైతులు పత్తి సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. వానకాలం పంటలు వంద శాతం దాటి అదనంగా 26.20కి రావొచ్చని అధికారులు తమ ప్రణాళికల్లో పేర్కొన్నారు.
ఆదాయం అధికంగానే..
పంటల బీమా ప్రీమియం, రవాణా ఖర్చులు కాకుండా పత్తి సాగు ఎకరానికి రూ.20 వేల వరకు పెట్టుబడి అవుతున్నది. నల్లరేగడి భూముల్లో నీళ్లు పెడితే ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్లు, వర్షాధారంగా అయితే 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది. చెలక భూముల్లో నీళ్ల వసతి ఉంటే 6 నుంచి 7, వర్షాధారంగా అయితే 4 నుంచి 5 క్వింటాళ్లు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో మద్దతు ధర క్వింటాలుకు రూ.4500 నుంచి రూ.5500 వరకు ఉంది. ఎకరానికి సగటున రూ.40వేల ఆదాయం రానున్నది. ఖర్చులు పోను రూ.15 వేల 20 వేల వరకు గిట్టుబాటు కానున్నట్లు వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. విదేశాల్లోనూ మన పత్తికి మంచి డిమాండ్ ఉన్నది.