ప్రైవేట్ వైద్యులు రిమ్స్లో ఒక రోజు వైద్యం అందించాలి
ఆదిలాబాద్ ఎమ్మెల్యేజోగు రామన్న
ఎదులాపురం,ఏప్రిల్25 : కొవిడ్ వ్యాక్సినేషన్ పెంచితే వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం డేవిడ్, రిమ్స్ వైద్యులతో ఆదివారం సమావేశమయ్యారు. వారం క్రితం సమావేశంలో కొవిడ్ వార్డు, ఇతర వార్డుల ఇండెంట్ మాస్క్లు, లిఫ్ట్ ఇతర సమస్యలపై చర్చించి పనుల పురోగతిపై సమీక్షించారు. కొవిడ్ బాధితులకు అవసరం మేరకు రెమ్డెసివిర్ అందుబాటులో ఉందని డైరెక్టర్ బలరాం వివరించారు. లిఫ్ట్ మరమ్మతుల కోసం పెండింగ్లో ఉన్న నిధులు ఇచ్చామని, ఇంకా పనులు కాలేదని పేర్కొన్నారు. మంగళవారం వరకు లిఫ్ట్ ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రత్యేకంగా మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు సిటీ స్కాన్ను కొవిడ్ బాధితులకు కేటాయించినట్లు వెల్లడించారు. కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందుబాటులో ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న 510 బెడ్స్ను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. 48 గంటల ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని చెప్పారు.
కొవిడ్ వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి దృష్ట్యా బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రజాప్రతినిధులు , అధికారులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. కొవిడ్ వార్డులో వారంలో రోజుకో విభాగానికి చెందిన అధికారి పర్యటించాలన్నారు. బాధితులకు అవసరం మేరకు ఆక్సిజన్ వెంటిలేటర్లు, రెమిడిసివిర్ ఇంజెక్షన్లు అందించాలని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రైవేట్ వైద్యులు ఒక రోజు రిమ్స్లో సేవలు అందిచాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత ఆరోపణలకకు ఇది సమయం కాదని, ప్రసుత్త పరిస్థితుల్లో అందరూ కలిసి కట్టుగా పని చేయాలని కోరారు. వైద్యులు సూచించిన ప్రకారం ఇండెంట్ రూపొందించి మందులు సమకూర్చుకోవాలని అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు. రోగులకు సరైన సమయానికి మందులు అందించాలని, సమయానుకూలంగా డైట్ సరఫరా చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శైలజ, వైద్యులు తొడసం చందు, సందీప్జాదవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘సర్కార్’లో మెరుగైన వైద్యం
ఎదులాపురం, ఏప్రిల్ 25 : సర్కారు వైద్యశాలల్లో మెరుగైన వైద్యం అందుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. రిమ్స్లో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులకు ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు అందిస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. వారం రోజు కిత్రం నిర్వహించిన సమావేశంలో చర్చించిన సమస్యలు, పరిష్కారం ,వివిధ పనుల పురోగతిపై ఆరా తీశారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్లో ఆదివారం పర్యటించారు. కొవిడ్ బాధితులకు అన్ని వసతులు, సౌకర్యాలు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయా ? లేవా అని వార్డుల్లో తిరుగుతూ పరిశీలించారు. వార్డులో ఎంత మంది విధులు నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మొదటి సమావేశంలో నిర్దేశించిన ప్రణాళిక ఇంకా పూర్తి కాలేదన్నారు. వెంటనే పెండింగ్ సమస్యలను పూర్తి చేయాలన్నారు. రాష్ట్రం నుంచి రావాల్సిన ఆక్సిజన్ వాహనాలను ఎవరైనా ఆపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ ఉన్నారు.