వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఎండలు మండిపోతున్నాయి. ఏసీలు సరిపోవటం లేదు. జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి కాలం ఆరంభంలోనే అమెరికాను ముఖ్యంగా పశ్చిమ అమెరికా రాష్ట్రాలను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో పశ్చిమ ప్రాంతాల్లో సుమారు 4 కోట్ల మంది ప్రజలను అమెరికా వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఎండల కారణంగా అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో గతంలో కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అమెరికా వాతావరణ శాఖ తెలిపింది. ఇదో అనూహ్య పరిస్థితిగా పేర్కొన్నది. అంతేగాకుండా ఈసారి వేసవిలో అన్ని రికార్డులూ బద్దలయ్యేలా ఉన్నాయని అంచనా వేస్తున్నది. సోమవారం ఫీనిక్స్లో 46 డిగ్రీల సెల్సియస్, సియాటెల్ లాంటి చోట్ల 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం పోర్ట్లాండ్లో 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
అమెరికాలో 1940 నుంచి ఇప్పటిదాకా ఇదే అత్యధిక రికార్డు ఉష్ణోగ్రతగా వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. సియాటెల్లో గత వారాంతం ఉష్ణోగ్రతలు 1894 నాటి రికార్డులను బద్దలుగొట్టాయని తెలిపారు. అన్ని పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నదని, ప్రతిచోటా పాత రికార్డులు బద్దలవుతున్నాయని, కాలిఫోర్నియాలోని పాల్స్ప్రింగ్స్లో 47 డిగ్రీల సెల్సియస్కుపైగా ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించారు.
హీట్డోమ్ కారణం
పసిఫిక్ మహా సముద్రంలో ఉష్ణోగ్రతల్లో తేడావల్ల ఏర్పడే హీట్డోమ్ కారణంగా ఉష్ణోగ్రతలు ఇంతగా మండిపోతన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ‘పర్యావరణ మార్పుల కారణంగానే ఇవన్నీ సంభవిస్తున్నాయి. ఇలా ఉష్ణోగ్రతలు పెరగటం అనేది ఇకమీదట మామూలవుతుంది. దీనికి అంతా అలవాటు పడాల్సిందే’ అని కాలిఫోర్నియా యూనివర్సిటీలో వాతావరణ నిపుణుడు డేనియల్ స్వెయిన్ వ్యాఖ్యానించారు.