Sri Lanka | పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ద్వీపదేశమైన శ్రీలంక (Sri Lanka) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ (India) సహా ఏడు దేశాల పౌరులకు వీసా లేకుండానే శ్రీలంకలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు (visa free entry) అనుమతివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్లాండ్ దేశాల టూరిస్టులకు ఉచిత వీసాలు జారీ చేసేందుకు శ్రీలంక కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి అలీ సబ్రీ (Ali Sabry) వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టే ఈ కార్యక్రమం వచ్చే ఏడాది మార్చి 31 వరకూ కొనసాగుతుందని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
Cabinet approves issuing of free visas to India, China, Russia, Malaysia, Japan, Indonesia & Thailand with immediate effect as a pilot project till 31 March –
— M U M Ali Sabry (@alisabrypc) October 24, 2023
కాగా, ద్వీపదేశమైన శ్రీలంకకు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు అన్న విషయం తెలిసిందే. దేశ జీడీపీలో 10 శాతం వాటా దీనిదే. కరోనాకు ముందు లంక పర్యాటక ఆదాయం 360 కోట్ల డాలర్లుండగా ప్రస్తుతం 60 కోట్ల డాలర్ల దిగువకు పడిపోయింది. 2019 నాటి కరోనా సంక్షోభానికి ఇక్కడి పర్యాటక రంగం కుదేలైంది. దానికి తోడు ఆర్థిక, రాజకీయ అనిశ్చితితో దేశం మొత్తం సంక్షోభంలోకి జారుకుంది. దీంతో ఆ దేశానికి పర్యాటకుల రాక క్రమంగా తగ్గిపోయింది.
ఏటా శ్రీలంకకు వచ్చే పర్యాటకుల్లో 30 శాతం మంది రష్యా, ఉక్రెయిన్, పోలండ్, బెలారస్కు చెందినవారే. యుద్ధం వల్ల ఇప్పుడు అక్కడి పర్యాటకులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో శ్రీలంక ఆదాయానికి మరింతగా గండిపడింది. దీంతో పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు నడుం కట్టిన శ్రీలంక ప్రస్తుతం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఈ నేపథ్యంలోనే 2023 సంవత్సరానికి 20 లక్షల మందిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఫ్రీ వీసా పాలసీని తీసుకొచ్చింది. కాగా శ్రీలంకలో ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగుపడుతున్నాయి. 2023 సెప్టెంబర్లో 10లక్షల మంది పర్యాటకులు శ్రీలంకకు వెళ్లారు. 2019 తర్వాత ఇంత మొత్తంలో పర్యాటకులు రావడం ఇదే తొలిసారి.
Also Read..