లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ II భర్త ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు వచ్చే వారం జరగనున్నట్లు బకింగ్హామ్ ప్యాలెస్ వెల్లడించింది. ఆయన అంత్యక్రియలకు ప్రిన్స్ హ్యారీ వస్తున్నాడని, అతని భార్య మేఘన్ మార్కెల్ మాత్రం రావడం లేదని కూడా తెలిపింది. కొవిడ్ ఆంక్షల కారణంగా ఫిలిప్ అంత్యక్రియలను సింపుల్గా ముగించాలని భావిస్తున్నారు.
ఈ మధ్యే ప్రిన్స్ హ్యారీ, అతని భార్య రాజకుటుంబాన్ని వదిలి అమెరికా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అంతేకాదు రాజకుటుంబంలోనూ వర్ణ వివక్ష ఉన్నదని మేఘన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం కూడా సంచలనం రేపింది. ఆ ఇంటర్వ్యూ తర్వాత తొలిసారి ప్రిన్స్ హ్యారీ బకింగ్హామ్ ప్యాలెస్కు రాబోతున్నాడు. అయితే గర్భవతి అయిన మేఘన్ ప్రయాణాలకు దూరంగా ఉండాలన్న వైద్యుల సలహా మేరకు అంత్యక్రియలకు రావడం లేదని ప్యాలెస్ వర్గాలు తెలిపాయి.
ఈ నెల 17న (శనివారం) ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు జరగనున్నట్లు ప్యాలెస్ వెల్లడించింది. పశ్చిమ లండన్లో ఉన్న విండ్సర్ కాజిల్లోని సెయింట్ జార్జ్ చాపెల్లో ఫిలిప్ అంత్యక్రియలు జరగనున్నాయి. అదే రోజు దేశవ్యాప్తంగా ఒక నిమిషం పాటు మౌనం పాటించనున్నారు. అంత్యక్రియలకు కేవలం 30 మంది మాత్రమే హాజరవ్వాలని ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.