Alexei Navalny | రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexei Navalny) మృతిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) తొలిసారి స్పందించారు. ఖైదీల మార్పిడి కింద నావల్నీని రష్యా జైలు నుంచి విడుదల చేయాలనుకున్నట్లు తెలిపారు. అయితే, అంతలోనే ఆయన మరణించారని అన్నారు. తాజాగా జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పుతిన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఖైదీల మార్పిడి కింద (prisoner exchange) నావల్నీని అప్పగించి పాశ్చాత్య దేశాల జైళ్లలో ఉన్న కొంతమంది వ్యక్తులను రష్యాకు తీసుకొద్దామనే ఆలోచనను సహచరులు తన ముందు ఉంచినట్లు చెప్పారు. ఇందుకు తాను అంగీకారం కూడా తెలిపినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన చర్చలు తుదిదశలో ఉండగా.. అంతలోనే ఇలా జరిగిపోయిందన్నారు. జరిగిందేదో జరిగిపోయింది.. ఇది జీవితం అని పుతిన్ వ్యాఖ్యానించారు.
రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexei Navalny).. సైబీరియన్ పీనల్ కాలనీ జైలు (prison)లో కొన్ని రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. నావల్నీ మృతికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకూ ఎవరికీ తెలియవు. అయితే, ఆయన్ని రష్యా అధ్యక్షుడు పుతినే హత్య చేయించాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ మరోసారి ఘన విజయం సాధించారు. మూడు రోజులుగా జరుగుతున్న రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది. ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్కు రికార్డు స్థాయిలో 87.8 శాతం ఓట్లు లభించినట్లు తెలుస్తున్నది. 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టిన మీదట ఈ విషయం తేలింది. దీంతో ఆయన ఐదోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టనున్నారు.
1999 నుంచి దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్న పుతిన్.. తాజా విజయంతో మరో ఆరేండ్లపాటు అదే పదవిలో ఉండనున్నారు. దీంతో రష్యాలో ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా జోసెఫ్ స్టాలిన్ను అధిగమించనున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో పుతిన్తో కలిపి నలుగురు అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. అయితే ప్రధాన ప్రధ్యర్థి అయిన నావల్నీ ఎన్నికలకు ముందే చనిపోవడంతో ఆయనకు అసలు పోటీయే లేకుండా పోయింది.
Also Read..
Vladimir Putin | ఏకపక్ష విజయం.. మరోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్
Prakash Raj | 420లు 400 సీట్లు గెలుస్తామంటున్నారు.. బీజేపీపై ప్రకాశ్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు
Putin: అమెరికా ప్రజాస్వామ్య దేశం కాదు: పుతిన్