మాస్కో: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) మరోసారి ఘన విజయం సాధించారు. మూడు రోజులుగా జరుగుతున్న రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది. ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్కు రికార్డు స్థాయిలో 87.8 శాతం ఓట్లు లభించినట్లు తెలుస్తున్నది. 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టిన మీదట ఈ విషయం తేలింది. దీంతో ఆయన ఐదోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టనున్నారు.
మార్చి 15న ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ మూడు రోజుల పాటు జరిగి 17న ముగిశాయి. 1999 నుంచి దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్న పుతిన్.. తాజా విజయంతో మరో ఆరేండ్లపాటు అదే పదవిలో ఉండనున్నారు. దీంతో రష్యాలో ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా జోసెఫ్ స్టాలిన్ను అధిగమించనున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో పుతిన్తో కలిపి నలుగురు అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. అయితే ప్రధాన ప్రధ్యర్థి అయిన నావల్నీ ఎన్నికలకు ముందే చనిపోవడంతో ఆయనకు అసలు పోటీయే లేకుండా పోయింది.
కాగా, చివరిరోజు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని, పుతిన్ విధానాలను వ్యతిరేకిస్తున్నవారు పోలింగ్ కేంద్రాలకు రావాలని దివంగత విపక్ష నేత నావల్నీ మద్దతుదారులు పిలుపునివ్వడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు కూడా జరిగాయి. కొన్నిచోట్ల బ్యాలెట్ పెట్టెల్లో ఇంకు, ఆకుపచ్చ రంగు యాంటీసెప్టిక్ ద్రావణాలను పోసేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు అరెస్టయ్యారు. కేరళలోని తిరువనంతపురంతోపాటు.. పలు యూరప్ దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న రష్యా దౌత్య కార్యాలయాల్లో ఆ దేశ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్న విషయం తెలిసిందే.