వ్యవసాయ, ఉపాధి రంగాలకు ప్రాధాన్యం
గతేడాదికంటే 36.28 శాతం పెరిగిన నిధులు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ):కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళికను సర్కారు ఖరారు చేసింది. 2020-21లో రూ. 1652.50 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 2218.59 కోట్లతో అమలు చేయనున్నది. గతేడాదికంటే 36.59 శాతం నిధులు అదనంగా కేటాయించగా, ఇందులో అత్యధికంగా వ్యవసాయ, ఉపాధి రంగాలకు ప్రాధాన్యమిచ్చింది.
జిల్లాలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తూ రుణ ప్రణాళికలను ప్రభుత్వం ఖరారు చేసింది. గత ఏడాది కంటే ఈ ఏడాది 36.59 శాతం నిధులు అదనంగా కేటాయించిం ది.2020-21 సంవత్సరానికిగాను రూ. 1652. 50కోట్లతో ప్రణాళికలు అమలు చేయగా, 2021 -22 ఆర్థిక సంవత్సరానికి రూ. 2218.59 కోట్లతో వార్షిక ప్రణాళికలను రూపొందించింది.
రూ.2218.59 కోట్లతో
జిల్లా వార్షిక ప్రణాళికలను 2218.59 కోట్ల రూపాయలతో రూపొందించారు. వ్యవసాయం, పారిశ్రామిక, ఉపాధి రంగాలతోపాటు ఇతర రంగాల అభివృద్ధికోసం ఈ నిధులను వినియోగంచనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రభుత్వం ఏడాది 36.28 శాతం నిధులను అదనంగా కేటాయించింది. వార్షిక బడ్జెట్లో రూ.1318.87 కోట్ల ను రైతులకు పంటరుణాలుగా ఇచ్చేందుకు కేటాయించారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి రూ. 507.73 కోట్లు కేటాయించారు. రుణాలను సకాలంలో రైతులకు అందించడంతో పాటు పంట రుణాలకోసం కేటాయించిన నిధులను రైతులకు అందించి ఉత్పాదక పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
పంటరుణాలకు రూ.1318.87 కోట్లు
జిల్లాలో రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం రూ. 1318.87 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. పంటలు వేసుకునే సమయంలో రైతులు దళారులను, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా, కోరుకున్న మేరకు బ్యాంకుల ద్వా రా రుణాలు అందించేందుకు ప్రణాళికలు ఖరారు చేశారు. జిల్లాలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు. ఏటా వీరు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇచ్చే పంటరుణాలపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటారు. ప్రభుత్వం రైతుబంధు కు తోడు పంట రుణాలను అందిస్తుండడంతో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు వేసుకుంటున్నారు.
అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం..
జిల్లాలో వ్యవసాయ రంగంతోపాటు దాని అనుబంధ రంగాలకు కూడా నిధులు కేటాయించారు. బడ్జెట్లో రూ. 507.73 కోట్లు ఖర్చు చేయనున్నారు. వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడేలా ప్రాధాన్యత క్రమంలో నిధులు వెచ్చించనున్నారు. వీటితోపాటు పారిశ్రామిక రంగాలకు రూ.164.40 కోట్లు కేటాయించారు. ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ. 107.29 కోట్లు. అప్రాధాన్యత రంగాలకు రూ.120.30 కోట్లు కేటాయించారు.
38.28 శాతం పెరిగిన నిధులు
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వార్షిక ప్రణాళికల్లో నిధుల కేటాయింపు 36.28 శాతం పెరిగింది. గత ఏడాది రూ. 1627.93 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ. 2218.59 కోట్లు కేటాయించారు. గత ఏడాది వ్యవసాయ పంట రుణాలకు రూ. 1106.67 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.1318.87 కోట్లు కేటాయించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు గత ఏడాది రూ. 264.53 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ. 507.73 కోట్లు కేటాయించారు. పారిశ్రామిక రంగాలకు గత ఏడాది రూ. 70.44 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ. 164.40 కోట్లు కేటాయించారు. ప్రాధాన్యత రంగాలకు గత ఏడాది రూ. 95.77 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ. 107.29 కోట్లు నిధులు కేటాయించారు. అప్రాధాన్యత రంగాలకు గత ఏడాది రూ. 90.50 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది రూ. 120.30 కోట్లు కేటాయించారు.