Pakistan | పెహల్గామ్ దాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ (Pakistan)పై భారత్ పలు ఆంక్షలు విధించింది. అందుకు ప్రతిగా పాక్ సైతం భారత్ను దెబ్బతీయాలనే దురుద్దేశంతో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే, ఆ నిర్ణయాలు బెడిసికొట్టినట్లు తెలిసింది. పాక్ నిర్ణయాలు ఆ దేశానికే తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల లక్షలాది డాలర్ల ఆదాయానికి గండి పడింది. అదెలా అంటారా..?
పెహల్గామ్ ఘటన అనంతరం పాకిస్థానపై భారత్ విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా భారత్ నుంచి వచ్చే విమానాలకు ఆ దేశం తన గగనతలాన్ని (airspace) మూసివేసిన విషయం తెలిసిందే. ఆ ప్రభావం అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడింది. ముఖ్యంగా ఢిల్లీ, ఇతర ఉత్తర ప్రాంత నగరాల నుంచి బయలుదేరే విమానాలు తాము చేరుకునే గమ్యస్థానాల దూరం పెరిగింది. విమాన ప్రయాణ సమయం, ఇంధన ఖర్చు పెరిగింది. అదే సమయంలో భారత్ విమానయాన సంస్థలతోపాటు పాక్ కూడా భారీగా నష్టపోతోంది.
విమానాలు ఒక దేశ గగనతలం మీదుగా ప్రయాణించినప్పుడు ఆ దేశానికి ‘ఓవర్ఫ్లైట్ ఫీజులు’ చెల్లించాల్సి ఉంటుంది. పశ్చిమ దేశాలకు వెళ్లే భారత విమానాలు ఎక్కువగా పాకిస్థాన్ గగనతలాన్ని ఉపయోగిస్తుంటాయి. పాక్ గగనతలాన్ని వినియోగించుకున్నందుకు ఏటా మిలియన్ల డాలర్లు ఆ దేశానికి ఓవర్ఫ్లైట్ ఫీజుల కింద చెల్లిస్తుంటాయి. దీని ద్వారా పాక్కు ఏటా కోట్లాది డాలర్ల ఆదాయం సమకూరేది. తాజా ఆంక్షల వల్ల పాక్కు ఈ ఆదాయం నిలిచిపోనుంది. దాయాది దేశం ఏకంగా లక్షల డాలర్ల నష్టం చవిచూడాల్సి వస్తోంది. దీని ప్రభావం పాక్ ఆర్థిక వ్యవస్థపై గణనీయంగా ఉంటుందని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. మన దేశ విమానయాన రంగాన్ని దెబ్బతీయాలని తీసుకున్న ఈ నిర్ణయంతో పాక్ తన గోతిని తానే తవ్వుకున్నట్లైంది.
పాకిస్థాన్ ఇలా భారత్ నుంచి వచ్చే విమానాలకు తన గగనతలాన్ని మూసివేయడం ఇదేమీ మొదటిసారి కాదు. జూలై 2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసింది. అప్పుడు దాదాపు 400 విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. ఫలితంగా పాక్ 100 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. ప్రస్తుత చర్యతో పాక్ మరోసారి అలాంటి నష్టాలనే ఎదుర్కోవాల్సి వచ్చింది.
పలు నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ గగనతలం మీదుగా ప్రయాణించే బోయింగ్ 737 విమానాలు ఓవర్ఫ్లైట్ ఫీజుగా దాదాపు 580 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద విమానాలకు ఈ ఫీజులు ఇంకా ఎక్కువగానే ఉంటాయి. తాజా నిర్ణయంతో ఓవర్ ఫ్లైట్ ఛార్జీల ద్వారానే పాకిస్థాన్ ప్రతిరోజూ దాదాపు $232,000 మేర నష్టపోతోందని అంచనా. దీనికి తోడు ల్యాండింగ్, పార్కింగ్ వంటి ఇతర ఛార్జీలతో కలిపి రోజువారీ నష్టం దాదాపు $300,000 వరకూ ఉంటుందని అంచనా. ఏది ఏమైనా భారత్ను దెబ్బతీయాలని తీసుకున్న ఈ నిర్ణయం పాక్కు తన వేలితో తన కంటినే పొడుచుకున్నట్లైంది.
Also Read..
JK Assembly | పహల్గాం ఉగ్రదాడి మృతులకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ నివాళులు
Cheetah | కూనో పార్క్లో ఐదు కూనలకు జన్మనిచ్చిన నిర్వా.. దేశంలో 31కి పెరిగిన చీతాల సంఖ్య
BBC | పెహల్గామ్ ఉగ్రదాడి కవరేజీపై ఆగ్రహం.. బీబీసీ ఇండియా హెడ్కి కేంద్రం లేఖ