మెదక్ మున్సిపాలిటీ, మే 28: హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి అన్నారు. హరిత శుక్రవారం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని రేణుకాంబ దేవాలయం నుంచి ఆటోనగర్ వరకు రోడ్డు డివైడర్ మధ్యల గల పూల మొక్కలకు మున్సిపల్ కమిషనర్ శ్రీహరి నీరు పోశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో భాగంగా మున్సిపల్ పరిధిలో నాటిన మొక్కల సంరక్షణకు వార్డుకు సంబంధించిన అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వచ్చే హరితహారానికి పట్టణంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలు పెంపకం చేయడం జరిగిందని త్వరలోనే పట్టణంలో ఖాళీ స్థలాలను గుర్తించనున్నట్లు పేర్కొన్నారు.
పారిశుధ్య పనుల పరిశీలన
పట్టణంలో శాంతినగర్, ప్రభుత్వ దవాఖాన ప్రాంతాలలో జరుగుతున్న పారిశుధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. కరోనా నేపథ్యంలో పట్టణంలో పారిశుధ్య పనుల్లో ఎలాంటి లోపాలు జరుగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శానిటైజేషన్, పరిసరాల శుభ్రత తదితర చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ శ్రీహరి తెలిపారు. ఇప్పటికే పట్టణంలో ట్యాంకర్ల ద్వారా రెండుసార్లు శానిటైజేషన్ చేశామన్నారు. పట్టణంలో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని, ప్రజలు అనవసరంగా ఇండ్ల నుంచి బయటికి రావొద్దన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. కరోనా వైరస్ కట్టడి ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలన్నారు. అనంతరం పట్టణలో జరుగుతున్న రెండో విడుత జ్వర సర్వేను పరిశీలించారు. సర్వే వివరాలను ఆశ వర్కర్లు, మెప్మా మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత, పారిశుధ్య జవాన్లు ఉన్నారు.