Gaza City : హమాస్ రెబెల్స్ (Hamas rebels) కు, ఇజ్రాయెల్ (Israel) సైన్యానికి మధ్య దాదాపు 23 నెలలుగా కొనసాగుతున్న యుద్ధం మరో కీలక మలుపు తిరిగింది. గాజా సిటీ (Gaza city) ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడం కోసం ఇజ్రాయెల్ రూపొందించిన ప్రణాళికకు ఆ దేశానికి చెందిన భద్రతా క్యాబినెట్ (Security cabinet) ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు (Benzamin Nethanyahu) కార్యాలయం కూడా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా పరిణామంతో గాజాలో సైనిక కార్యకలాపాలు మరింత విస్తృతం కానున్నాయి.
సెక్యూరిటీ క్యాబినెట్ సమావేశానికి ముందు ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రధాని నెతన్యాహు ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా భద్రతను పటిష్టం చేసుకునేందుకు, హమాస్ను పూర్తిగా తొలగించేందుకు, అక్కడి ప్రజలకు స్వేచ్ఛ కల్పించేందుకు గాజా మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తోంది’ అని తెలిపారు. అయితే గాజాను శాశ్వతంగా అట్టిపెట్టుకునే ఉద్దేశం తమకు లేదని, అక్కడ ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, సరైన రీతిలో పాలించగల అరబ్ దళాలకు పాలనా బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు.
కాగా నెతన్యాహు వ్యాఖ్యలపై హమాస్ తీవ్రంగా స్పందించింది. చర్చల ప్రక్రియను దెబ్బతీసేందుకే ఇజ్రాయెల్ ప్రధాని ఈ ప్రకటన చేశారని, యుద్ధం వెనుక ఉన్న ఆయన నిజమైన ఉద్దేశాలు ఇప్పుడు బయటపడ్డాయని ఒక ప్రకటనలో ఆరోపించింది. మరోవైపు గాజాలో మానవతా సంక్షోభం కూడా రోజురోజుకు తీవ్రమవుతోంది. 2023 అక్టోబర్లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 61,258 మంది పాలస్తీనియన్లు మరణించగా.. 1,52,045 మంది గాయపడినట్లు గాజా ఆరోగ్య అధికారులు గురువారం తెలిపారు.
ఇజ్రాయెల్ దిగ్బంధనం కారణంగా గాజాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈ, జోర్డాన్, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ దేశాలు బుధవారం 107 సహాయక ప్యాకేజీలను విమానాల ద్వారా గాజాలో జారవిడిచాయి. అయితే భూమార్గాల ద్వారా పెద్ద ఎత్తున సహాయాన్ని అనుమతిస్తే తప్ప, ఈ ఎయిర్డ్రాప్స్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఐక్యరాజ్యసమితి అధికారులు అంటున్నారు.
మానవతా సాయం అందించేందుకు వీలుగా జూలై 27 నుంచి గాజాలోని జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సైనిక కార్యకలాపాలకు ‘వ్యూహాత్మక విరామం’ పాటిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. డేర్ అల్-బలా, అల్-మవాసి, గాజా సిటీ వంటి ప్రాంతాల్లో ఈ విరామాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.