మిర్యాలగూడటౌన్, మే,30: కరోనా కట్టడికి ప్రభు త్వం అమలు చేస్తున్న లాక్డౌన్ నిబంధనలు అందరూ పాటించాలని వన్టౌన్ సీఐ సదా నాగరాజు కోరారు. ఆదివారం పట్టణంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అద్దంకి నార్కట్పల్లి ప్రధాన రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో తగిన ధ్రువపత్రాలను వెంట తీసుకొని వెళ్లాలని సూచించారు. నిబంధనలు పాటించని ఆరుగురు దుకాణా దారులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట ఎస్ఐ అంతిరెడ్డి, సిబ్బంది ఉన్నారు.
రోడ్లన్నీ నిర్మానుష్యం
హాలియా/మాల్: లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతుండడంతో హాలియా, మాల్ పట్టణాల్లో ఆదివారం ఉదయం 10 గంటల తరువాత రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు బయటికి వచ్చి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశారు. పోలీసులు నిత్యం గస్తీ నిర్వహిస్తూ అనవసరంగా బయటకు వచ్చే వారిని నిలువరించారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేసి, జరిమానా విధించారు.
ఈ పాస్ తప్పనిసరి : సీఐ
నందికొండ : తెలంగాణలోకి వచ్చే వాహనదారులు అనుమతులకు సంబంధించి ఈ-పాస్ కలిగి ఉండాలని నాగార్జునసాగర్ సీఐ గౌరీనాయుడు స్పష్టం చేశారు. నందికొండ పైలాన్కాలనీలోని తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు చెక్పోస్ట్ వద్ద ఆదివారం వాహనాల తనిఖీని ఆయన పరిశీలించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు లాక్డౌన్ సమయంలో బయటికి రావద్దని, సడలింపు సమయంలో మాత్రమే కొనుగోళ్లు జరుపాలని సూచిం చారు. ఆయన వెంట విజయపురి టౌన్ ఎస్ఐ నర్సింహారావు, పోలీస్, హెల్త్ సిబ్బంది ఉన్నారు.