చెన్నై: సుమారు రూ.666 కోట్ల విలువైన బంగారం తరలిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికులను చెదరగొట్టారు. ఆ వాహనం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీ భద్రత మధ్య బంగారు ఆభరణాలను మరో వాహనం ద్వారా గమ్యస్థానానికి చేర్చారు. (Truck carrying gold met with accident) తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన వాహనంలో సుమారు రూ.666 కోట్ల విలువైన 810 కిలోల బంగారు ఆభరణాలున్నాయి. కోయంబత్తూరు నుంచి సేలంలోని జ్యుయలరీ షాపులకు వాటిని బుధవారం తరలిస్తుండగా ఈరోడ్ సమీపంలో బంగారం తీసుకెళ్తున్న వాహనం అద్దాలపై మరో వాహనానికి చెందిన టార్పాలిన్ పడింది. దీంతో బంగారు ఆభరణాలు తరలిస్తున్న వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అది ప్రమాదానికి గురైంది. డ్రైవర్ శశికుమార్, సెక్యూరిటీ గార్డు పాల్రాజ్ తీవ్రంగా గాయపడ్డారు.
కాగా, ఈ విషయం తెలుస్తున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరారు. ప్రమాదానికి గురైన బంగారం వాహనం వద్ద గుమిగూడిన స్థానికులను చెదరగొట్టారు. గాయపడిన డ్రైవర్, సెక్యూరిటీ గార్డును ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్కు చేర్చారు. గట్టి భద్రత మధ్య అందులో ఉన్న బంగారు ఆభరణాల ప్యాక్లను మరో వాహనంలోకి చేర్చారు. అక్కడి నుంచి గమ్యస్థానానికి వాటిని పంపారు. కాగా, రూ.666 కోట్ల విలువైన 810 కిలోల బంగారు ఆభరణాలు తరలిస్తున్న వాహనం ప్రమాదానికి గురైన విషయం స్థానికంగా కలకలం రేపింది.