Terrorism | ‘ఉగ్రవాదులకు మేం మద్దతివ్వట్లేదు. అసలు మా గడ్డపై ఉగ్రవాదులు లేరు’ అంటూ బుకాయిస్తూ వస్తున్న పాక్ (Pakistan) నిజస్వరూపం బట్టబయలైంది. ఉగ్రవాదులను పెంచి పోషించినట్లు ఆ దేశమే మీడియా సాక్షిగా ఒప్పుకుంది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, నిధులు సమకూర్చడంలో పాకిస్థాన్కు సుదీర్ఘ చరిత్ర ఉందని స్వయంగా ఆ దేశ రక్షణమంత్రి (Pakistan defence minister) ఖవాజా ఆసిఫ్ (Khwaja M Asif) అంగీకరించారు.
పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ‘స్కై న్యూస్’ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు సమాధానాలిచ్చారు. ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు వంటి అంశాలపై జర్నలిస్ట్ ప్రశ్నించగా.. ఆయన అసలు విషయం బయటపెట్టారు. ‘అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం’ అని కుండ బద్దలు కొట్టారు. ఇలాంటి పనులు చేయడం పొరపాటు అని తర్వాత అర్థమైనట్లు చెప్పారు. ఆ పనులు చేయడం వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు చెప్పుకొచ్చారు. సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో తాము చేరకపోయి ఉంటే.. పాకిస్థాన్కు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉండేదని వ్యాఖ్యానించారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ గురించి కూడా ఖవాజాకు ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు స్పందించిన ఖవాజా ప్రస్తుతం పాకిస్థాన్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ లేదని తెలిపారు. ‘లష్కరే అనేది పాత పేరు. అది ఇప్పుడు ఉనికిలో లేదు. దాని అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ గురించి నేను ఎప్పుడూ వినలేదు’ అంటూ సమాధానమిచ్చారు.
Also Read..
Pahalgam Attack | ఉగ్రవాదుల కోసం వేట.. పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు