టొరంటో: ఇండియా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై ఏ స్థాయిలో చర్చ జరుగుతున్నదో తెలిసిందే. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దులో ఇంకా ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఆందోళనలకు గతంలో కెనడా ప్రధాని ట్రూడో మద్దతు తెలిపారు. అయితే ఇప్పుడు మాత్రం అదే కెనడాలోని ఓ ప్రావిన్స్ ప్రిమియర్ మాత్రం ఈ వ్యవసాయ చట్టాలను వెనకేసుకు రావడం గమనార్హం.
ఈ చట్టాలు దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇస్తాయని కెనడాలోని సస్కాచ్వన్ ప్రావిన్స్ ప్రిమియర్ స్కాట్ మో అన్నారు. కెనడాలోనూ ఇలాంటి చర్యలే మంచి ఫలితాలు తీసుకొచ్చాయని చెప్పడం విశేషం. వృద్ధి అనేది మార్పుతోనే సాధ్యం. మార్పు ఎప్పుడూ సులువుగా ఉండదు. వృద్ధి గొప్ప అవకాశాలను తీసుకొస్తుంది అని స్కాట్ మో స్పష్టం చేశారు. ఇండో-కెనడా చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన వెబినార్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నిజానికి మొదటి నుంచీ ఆయన ఈ చట్టాలకు మద్దతిస్తున్నారు. కెనడాలో సెటిలైన భారతీయులు, అందులోనూ ఈ ఆందోళనల్లో ఎక్కువగా పాల్గొంటున్న పంజాబీలు వీటిని వ్యతిరేకిస్తున్నా స్కాట్ మో మాత్రం మద్దతిచ్చారు. 2012లో తన ప్రావిన్స్లో ఉన్న కెనడియన్ గోధుమ బోర్డును రద్దు చేయడం మంచి ఫలితాలను ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఆ బోర్డు ఇండియాలోని వ్యవసాయ మార్కెట్ల వంటిదే. మొదట్లో ఈ నిర్ణయం వల్ల అనిశ్చితి నెలకొన్నా.. ఆ తర్వాత విప్లవాత్మక మార్పులు చోటు చేసుకొని వ్యవసాయ ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగినట్లు స్కాట్ మో చెప్పారు.
2012లో సస్కాచ్వన్లో ఉన్న పరిస్థితులే ఇప్పుడు ఇండియాలో ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. సంస్కరణలు కొన్ని సవాళ్లను తీసుకొచ్చినా.. వాటికి తమ రైతులు త్వరగా అలవాటు పడ్డారని మో తెలిపారు.
ఇవి కూడా చదవండి
IPL 2021: స్పెషల్ జెర్సీతో బెన్ స్టోక్స్కు రాయల్స్ వీడ్కోలు.. వీడియో
నావాల్నీ ఏ క్షణంలో అయినా చనిపోవచ్చు: డాక్టర్లు
IPL 2021: ధోనీ రికార్డు బద్ధలుకొట్టిన రోహిత్ శర్మ
కరోనా నుండి కోలుకున్న బాలీవుడ్ ప్రేమ జంట
కుంభమేళాకు వెళ్లినవారికి క్వారంటైన్ తప్పనిసరి
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్కు కరోనా
కేరళ అందాలను చూసి తన్మయత్వం చెందిన అనసూయ