Fire Accident | దక్షిణాఫ్రికా (South Africa)లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జొహన్నెస్బర్గ్ (Johannesburg)లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో గురువారం తెల్లవారుజామున భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 63 మంది సజీవదహనమయ్యారు.
సెంట్రల్ జొహన్నెస్బర్గ్లోని ప్రముఖ బిజినెస్ డిస్ట్రిక్ట్లోఉన్న ఓ ఐదు అంతస్తుల భవనంలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భవనం నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక దళాలకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ మంటల్లో ఇప్పటి వరకూ 63 మంది సజీవ దహనమయ్యారు. మరో 43 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సర్వీసెస్ తెలిపింది.
‘ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 63 మృతదేహాలను గుర్తించాం. మరో 43 మంది గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నిరాశ్రయలు ఈ బిల్డింగ్లో నివాసం ఉంటున్నారు. వారు ఎలాంటి లీజ్ అగ్రిమెంట్లు లేకుండానే అక్కడ నివసిస్తున్నారు. అందువల్ల భవనంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించడం కష్టంగా మారింది’ అని ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అధికార ప్రతినిధి ములాద్జీ వెల్లడించారు. జొహన్నెస్బర్గ్ నగరానికి ఇది నిజంగా విచారకరమైన రోజు అని అన్నారు. తన 20ఏళ్ల సర్వీసులో ఇలాంటి ఘటనలు ఎన్నడూ చూడలేదని చెప్పారు.
కాగ, భవనంలో సుమారు 200 మంది నవాసం ఉంటున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు పేర్కొంది. మంటల ధాటికి భవనం చాలా వరకు దెబ్బతిన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నట్లు తెలిపింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.
Also Read..
Elections | జమ్మూకశ్మీర్లో ఏ క్షణమైనా ఎన్నికలకు సిద్ధమే : సుప్రీంకు తెలిపిన కేంద్రం
Anand Mahindra | రాఖీ వేళ.. చెల్లికి క్షమాపణలు చెప్పిన ఆనంద్ మహీంద్ర