మన్సూరాబాద్, ఆగస్టు 19 : నక్సల్స్ ముసుగులో వ్యాపారులను బెదిరించి డబ్బుల వసూళ్లకు యత్నించిన కేసులో నలుగురిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఎల్బీనగర్లోని రాచకొండ కమిషనరేట్ సీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సన్ప్రీత్ సింగ్ కేసు వివరాలను వెల్లడించారు.
ఏపీలోని కృష్ణా జిల్లా పామర్రు గ్రామానికి చెందిన కొడుమూరి శ్రీనివాస్ అలియాస్ ఎం. జనార్ధన్ రెడ్డి అలియాస్ భాస్కర్ (45) ప్రస్తుతం డైలీ ఫైనాన్స్ చేస్తుంటాడు. గతంలో సీపీఐ ఎంఎల్ పార్టీలో పని చేశాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూరు గ్రామానికి చెందిన ఆలుట్ల ఉప్పలయ్య అలియాస్ ఉపేందర్ (42) ప్రస్తుతం కొత్తపేట, చైతన్యపురి, ప్రభాత్నగర్లో నివాసముంటూ పెయింటింగ్ పని చేస్తుంటాడు.
ఉపేందర్ గతంలో పీడీఎస్యూ, సీపీఐ ఎంఎల్ పార్టీలో పని చేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా, మోటకొండూరు మండలం, దిలావర్పూర్ గ్రామానికి చెందిన తాటికాయల సురేందర్ అలియాస్ సూర్యం (40) కూలీ పని చేస్తుంటాడు. గతంలో పీడీఎస్యూ నల్గొండ కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు. భాస్కర్, ఉపేందర్ గతంలో నక్సల్స్ పేరుతో వ్యాపారుల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడిన కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారు.
జైలు నుంచి విడుదలై వచ్చినప్పటికీ వీరిలో మార్పు రాలేదు. జైలు నుంచి వచ్చిన తరువాత భాస్కర్, ఉపేందర్, సూర్యం ముగ్గురు ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. వీరికి సహాయకులుగా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్గా పని చేసే ఆలుట్ల గణేష్ (21)తో పాటు వెంకన్న అనే ఇద్దరిని నియమించుకున్నారు.
సీపీఐ ఎంఎల్, రైతు కూలీ సంఘం (ఆర్సీఎస్)కు పార్టీ ఫండ్ వసూలు చేసే నెపంతో వ్యాపారులను బెదిరింపులకు పాల్పడి డబ్బులు కాజేయాలని పథకం వేసుకున్నారు. తమ పథకాన్ని అమలు చేసేందుకు భాస్కర్, సూర్యం తమ స్వస్థలాల నుంచి నగరానికి వచ్చి ఎల్బీనగర్ పరిసరాలలోని లాడ్జీలలో బస చేస్తారు. నక్సల్స్ ముసుగులో భాస్కర్, సూర్యం, ఉపేందర్ ముగ్గురు కలిసి వ్యాపారులకు ఫోన్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు.
నక్సల్స్ పేరుతో ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయంపై ఇద్దరు వ్యాపారులు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొత్తపేట, మోహన్నగర్లో స్విఫ్ట్ కారు (ఏపీ29 బీబీ2338)లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న భాస్కర్, ఉపేందర్, సూర్యం, గణేష్ను చైతన్యపురి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నక్సల్స్ పేరుతో వ్యాపారులకు ఫోన్లు చేసి వసూళ్లకు యత్నించిన విషయం బయటపడింది.
నిందితులైన భాస్కర్, ఉపేందర్, సూర్యం, గణేష్ను రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు వెంకన్న పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి ఒక స్విఫ్ట్ కారు, ల్యాప్టాప్, సెల్ఫోన్లు-8, సిమ్ కార్డులు, మెమెరీ కార్డులు, సీపీఐ ఎంఎల్ పార్టీకి చెందిన విజిటింగ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, చైతన్యపురి సీఐ బి. రవికుమార్, ఎస్సై పి. నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.