GHMC | సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : వచ్చే వర్షాకాలంలో గ్రేటర్లో వరద ముంపు పొంచి ఉన్నదా? అంటే నత్తనడకన జరుగుతున్న నాలా పూడికతీత , ఎస్ఆర్డీపీ తొలి విడత పథకం పనులను చూస్తే అవుననే అనక తప్పదు. ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది వేసవిలో దాదాపు రూ.45 కోట్ల ఖర్చుతో రూ.884.15 కిలోమీటర్ల మేర నాలా పూడిక తీత పనులు చేపట్టాలని నిర్ణయించి, మే 31వ తేదీ నాటికల్లా ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
అయితే ఇప్పటి వరకు సగం పనులు కూడా పూర్తి కాకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది. ఖైరతాబాద్, కూకట్పల్లి, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, చార్మినార్ జోన్లలో ఏ ఒక్క జోన్లో 50శాతం కూడా పనులు పూర్తి చేయలేదని, కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లింపులు లేకనే పనులు నత్తనడకన జరుగుతున్నట్లు తెలుస్తున్నది.
ఖైరతాబాద్ జోన్లోని ఐదు సర్కిళ్లు మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ ఉండగా రూ.10.73కోట్లతో 63 పనులు చేపడుతున్నారు. 171.256 కిలోమీటర్లు రూ. 53.96 కిలోమీటర్లు పూర్తి చేశారు. నిర్ధేశిత లక్ష్యంలోగా పనులు పూర్తి కావడం కష్టమేనని స్వయంగా ఇంజినీర్లలో చర్చ జరుగుతున్నది. బల్కాపూర్ నాలా డీసిల్టింగ్కు సంబంధించి మొత్తం 9.64 కిలోమీటర్లలో 4 కి.మీ.లు మాత్రమే పూర్తి చేశారు.
ఇప్పటికే సంస్థ పరిధిలో దాదాపు రూ.1000కోట్ల బకాయిలు ఉన్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు పనులు చేపట్టబోమని కాంట్రాక్టర్లు అల్టిమేటం జారీ చేస్తూ వస్తున్నారు. దీనికి తోడు సంస్థ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతున్నది. వెరసి జీహెచ్ఎంసీ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు అసక్తి కనబర్చడం లేదు. ఈ ప్రభావం తాజాగా నాలాల పూడిక తీత పనులపై పడుతున్నది. ఇదే జరిగితే సకాలంలో పనులు పూర్తి కాగా వచ్చే వర్షాకాలంలో వరద ముంపు సమస్యలు తప్పేలా లేవు.