CM KCR | విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరం ఒక మినీయేచర్ ఆఫ్ ఇండియా అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆరంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ మహానగరంలో ప్రజల అవసరాలు తీర్చేందుకు హెచ్ఎండీఏ పరిధిలో మురుగునీటి నిర్వహణ కోసం సీవరేజ్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నదని తెలిపారు. హైదరాబాద్ నగరంలో నిరంతరం తాగునీటి సరఫరా కోసం 2,214 కోట్ల రూపాయలతో చేపట్టిన సుంకిశాల ఇన్ టేక్ వెల్ పనులు త్వరలో పూర్తి కానున్నాయని పేర్కొన్నారు.
‘ రోజురోజుకూ పెరుగుతున్న విమాన ప్రయాణికుల రవాణా సౌకర్యం కోసం హైదరాబాద్ నలుమూలల నుంచి విమానాశ్రయానికి మెట్రోరైలు విస్తరణకు రూపకల్పన చేసుకున్నాం. మొత్తం 6,250 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం తన సొంత నిధులతోనే వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని సంకల్పించింది, దీనికి శంకుస్థాపన సైతం జరుపుకున్నాం. రాజధాని నగరంలో మౌలిక వసతులు మెరుగు పరచడానికి ప్రభుత్వం పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించడం కోసం ఎస్సార్డీపీ కింద 67 వేల 149 కోట్ల రూపాయలతో 42 కీలక రహదారులు, ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, ఆర్వోబీల అభివృద్ధి చేపట్టింది. వీటిలో చాలా భాగం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 275 కోట్ల రూపాయలతో 22 లింక్ రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. విదేశాల నుంచి వచ్చి హైదరాబాద్ ను చూసినవారు ఆశ్చర్యానందాలకు గురవుతున్నారు. ప్రపంచంలోని ఏ ప్రతిష్టాత్మక నగరానికీ తీసిపోని స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని వారంతా కితాబునిస్తుండటం మనందరికీ గర్వకారణం.’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి