KTR | హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం పైన ప్రత్యేక దృష్టి సారించాలని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్ కార్యక్రమం అత్యంత మందకొడిగా సాగుతున్నదని, ముఖ్యంగా ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ నియమించిన బూత్ లెవెల్ ఆఫీసర్లకు (BLOs) సరైన శిక్షణ, తగిన ఏర్పాట్లు ఇవ్వకపోవడంతో మొత్తం ఈ కార్యక్రమం అత్యంత మందకొడిగా కొనసాగుతున్నదని, దీనివల్ల ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఫీడ్బ్యాక్ వస్తోందని అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇంచార్జ్లు, ఎస్ఐఆర్ (SIR) కమిటీ నేతలు హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎస్ఐఆర్ (SIR) పై ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలు, అలాగే పార్టీ పరంగా చేయాల్సిన సూచనలపై ఈ సందర్భంగా సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి అత్యధిక జనసాంద్రత ఉండే మహానగరంలో ఈ ఎస్ఐఆర్ కార్యక్రమానికి సంబంధించిన ఫారాల పంపిణీ, వాటిలో ఓటర్ల నమోదు వంటి అంశాలపై సరైన అవగాహన లేకుండానే అధికారులను కేటాయించారని కిందటి స్థాయి నుంచి పార్టీ వర్గాలు ఇస్తున్న ఫీడ్బ్యాక్ను కేటీఆర్ ప్రస్తావించారు. అయితే ఎస్ఐఆర్ కార్యక్రమం అత్యంత కీలకమైన అంశమని.. ‘ఒక వ్యక్తికి ఒకే ఓటు’ ఉండాలన్న రాజ్యాంగ స్ఫూర్తి ఆధారంగా దొంగ ఓట్లు లేకుండా చూడాలని కోరారు. ఒకవైపు మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఉపఎన్నికల సందర్భంగా భారీగా బయటపడిన డబుల్ ఓట్లు, దొంగ ఓట్ల వ్యవహారాన్ని ప్రతి ఒక్క నాయకుడు గుర్తుంచుకోవాలని సూచించారు.
ప్రతీ ఒక్కరి ఓటు నమోదయ్యేలా చూడాలి..
ఈ సందర్భంగా ఎస్ఐఆర్కు సంబంధించి పార్టీ నియమించుకున్న బూత్ లెవెల్ అసిస్టెంట్ల (BLAs) సహకారంతో ఏ ఒక్కరి ఓటు పోకుండా చూడాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నందువలన డబుల్ ఓట్ల నమోదు లేదా ఇతర ప్రాంతాల వారిని ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు చేయించే ప్రయత్నాలు చేస్తున్నాయని, ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మద్దతు దారుల ఓట్లు పోయేలా ప్రయత్నం చేసే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి ప్రతీ ఒక్కరి ఓటు నమోదయ్యేలా చూడాలని, ఏ ఒక్కరి ఓటు అన్యాయంగా తొలగించబడకుండా చూడాలన్నారు. దీంతోపాటు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న డబుల్ ఓట్ల పైన పార్టీ శ్రేణులు దృష్టి సారించాలన్నారు. మరోవైపు ఎస్ఐఆర్కు సంబంధించిన అంశంలో ఎదురవుతున్న ఇబ్బందులను, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ని, సమస్యలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు పార్టీ తరఫున తీసుకుపోతున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో ఎస్ఐఆర్ కు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు మరింత చురుగ్గా ముందుకు పోవాలన్నారు. బూత్ లెవెల్ కార్యకర్తల సహకారంతో మరింత వేగం పెంచాలన్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, స్థానిక కార్యకర్తలు, పార్టీ నియమించుకున్నబూత్ లెవెల్ అసిస్టెంట్లతో (BLAs) సమన్వయం చేసుకోవాలని సూచించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇంచార్జ్ లు, సీనియర్ నాయకులకు ఎస్ఐఆర్ పైన కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.