బాన్సువాడ రూరల్/ బోధన్, ఏప్రిల్ 18:రాష్ట్రంలో జలసంపదను సృష్టించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, కాలువల ఆధునీకరణ వంటి కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నా యి. రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన సాగునీటి పథకాలతో మండు వేసవిలోనూ చెరువులు, కుంటలు, చెక్డ్యాము లు, నీటితో కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం చెరువులు నీళ్లతో కొత్త అందాలను సంతరించుకున్నాయి. వానకాలం సీజన్లో నారు మళ్ల కోసం వర్షపు జాడకోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి లేదు.
మిషన్ కాకతీయతో పూర్వ వైభవం..
వందల ఏండ్ల కింద తవ్విన చెరువులను ఇప్పటిదాకా పట్టించుకున్నవారు కనిపించలేదు. పూడిక మట్టితో నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది. రాష్ట్రంలో సాగునీటి తిప్పలను దూరం చేసేందుకు సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ అనే బృహత్తర పథకాన్ని అమలు చేసి చెరువులకు పూర్వవైభవం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గొలుసుకట్టు చెరువులను గుర్తించి వాటి మధ్య నీటి ప్రవాహ మార్గాలను సరిచేశారు. కోట్లాది రూపాయల వ్యయంతో ఒక ఉద్యమంలాగా కొనసాగిన మిషన్ కాకతీయ ఫలితంగా నేడు చెరువుల్లో జలకళను చూస్తున్నాం.. ప్రాజెక్టుతోపాటు ఎత్తిపోతల పథకాల నుంచి విడుదలైన నీటితో చెరువులు నింపుకొనే అవకాశం ఏర్పడింది.
కామారెడ్డి జిల్లాలో 100 ఎకరాలపైబడి విస్తీర్ణం ఉన్న చెరువులు 194, అంతకన్నా చిన్న చెరువులు 1056, ఊట చెరువులు 593, మత్తడులు 106, చెక్డ్యాములు 87 ఉన్నాయి. వీటి కింద 98,120 ఎకరాల ఆయకట్టు ఉంది. మిషన్కాకతీయ పథకం పుణ్యమా అని జిల్లాలో చెరువులకు మహర్దశ కలిగింది. మిషన్ కాకతీయ ఫేస్-1,2,3,4 కింద జిల్లాలో 1096 చెరువులను, ఆర్ఆర్ఆర్ పథకం కింద 39 చెరువులను, మినీ ట్యాంకు బండ్ పథకం కింద ఐదు చెరువులను అభివృద్ధి చేశారు. వీటి అభివృద్ధికి దాదాపు రూ. 258 కోట్లు ఖర్చు చేశారు. దీంతో వేసవిలోను జిల్లాలోని 50 శాతానికిపైగా చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి.
జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో 32,167 ఎకరాల ఆయకట్టు ఉంది. పోచారం ప్రాజెక్టు కింద 10,500, కౌలాస్ ప్రాజెక్టు పరిధిలో 1,141 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టులలో పుష్కలంగా నీరు ఉండడంతో వచ్చే వానాకాలం పంటలకు ఢోకా లేదు. జిల్లాలో చిన్ననీటి వనరులైన చెరువులు, మత్తళ్లు, ఊట చెరువులు, చెక్డ్యాములు మొత్తం 2,036 ఉండగా, వీటి కింద 98,120 ఎకరాల ఆయకట్టు ఉంది.నిజామాబాద్ జిల్లాలో మొత్తం 1202 చెరువులు ఉన్నాయి. బోధన్ నియోజకవర్గంలో 188, ఆర్మూర్ నియోజకవర్గంలో 213, బాల్కొండ నియోజకవర్గంలో 311, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 385 చెరువులు ఉన్నాయి. అలాగే జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో 105 చెరువులు ఉన్నాయి.
ఎత్తిపోతల పథకాలతో…
ఈ ఏడాది వానకాలం సీజన్ నుంచి అలీసాగర్, గుత్ప, చౌట్పల్లి, హన్మంత్రెడ్డి ఎత్తిపోతల పథకాలు సమర్థవంతంగా పని చేశాయి. వీటితో ఆయకట్టు పరిధిలో చెరువులను నింపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, లక్ష్మీకాలువ ద్వారా 67 చెరువులు నిండాయి. వడ్యాట్ గ్రామంలో హన్మంత్రెడ్డి ఎత్తిపోతల ద్వారా వడ్యాట్ గ్రామంలోని పటేల్కుంట, మోర్తాడ్ ముసలమ్మ, తిమ్మాపూర్ విజయలక్ష్మి, ధర్మోరా పెద్దచెరువును వేంపల్లి ఎత్తిపోతల ద్వారా నింపారు.
మత్తడి దుంకుతున్న కూడవెల్లి వాగు
భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు పైన కనిపిస్తున్నది.. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని కూడవెల్లి వాగు. ప్రస్తుతం మండుటెండల్లోనూ మత్తడి దుంకుతున్నదంటే ఆశ్చర్యంగా చూడాల్సిందే. దీనికి కారణం.. కాళేశ్వరం నుంచి కదిలివచ్చిన గోదావరి జలాలు. కాళేశ్వరం జలాలు పలు చెక్డ్యాములను నింపుతూ ఎగువ మానేరును చేరుకున్నాయి. వాగు ఉధృతంగా ప్రవహిస్తుడడంతో భూగర్భ జలమట్టం పెరిగి చుట్టుపక్కల గ్రామాల్లో పొలాలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయి.
-బీబీపేట్
సత్ఫలితాలిస్తున్న ఎస్సారెస్పీ పునర్జీవం..
మోర్తాడ్, ఏప్రిల్18: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకం సత్ఫలితాలిస్తున్నది. నేడు మండుటెండల్లో కూడా చెరువులు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. బీడు భూములన్నీ యాసంగిలోనూ పచ్చగా మారాయి. ఎస్సారెస్పీ నీటితో ఎత్తిపోతలు, వరదకాలువ ద్వారా తూములతో చెరువులను నింపారు. వడ్యాట్ గ్రామంలో హన్మంత్రెడ్డి ఎత్తిపోతల ద్వారా వడ్యాట్ గ్రామంలోని పటేల్కుంట, మోర్తాడ్లోని ముసలమ్మ చెరువు, తిమ్మాపూర్లోని విజయలక్ష్మి, ధర్మోరా పెద్దచెరువును వేంపల్లి ఎత్తిపోతల ద్వారా నింపారు. ముసలమ్మ చెరువు కింద 800ఎకరాల ఆయకట్టు, ధర్మోరాపెద్దచెరువు కింద 1200ఎకరాల ఆయకట్టు, విజయలక్ష్మి చెరువు కింద 120 ఎకరాల ఆయకట్టు ఉంది. కాకతీయకాలువకు నిర్మించిన తూముల ద్వారా పాలెం గ్రామానికి చెందిన రామ్సాగర్ చెరువు, బూరుగు చెరువులను నింపారు. రామ్సాగర్ చెరువుకు 210 ఎకరాలు, బూరుగుచెరువుకు 330 ఎకరాల ఆయకట్టు ఉంది. వరదకాలువకు తిమ్మాపూర్, దొన్కల్ వద్ద తూముల నిర్మాణం పనులు పూర్తికావచ్చాయి. వీటి ద్వారా ఆయా గ్రామాల చెరువులను కూడా వరదకాలువ నీటితో నింపే అవకాశం ఉంది. శెట్పల్లి ఊరచెరువు హన్మంత్రెడ్డి ఎత్తిపోతలకు రిజర్వాయర్గా ఉంది. ఈ చెరువు కూడా నిండుకుండలా ఉంది. దీని కింద 480 ఎకరాల ఆయకట్టుకు ఏడాది పొడుగునా సాగునీరు అందుబాటులో ఉంటుంది.
కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం కానున్న ఉమ్మడి జిల్లా..
ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ కాళేశ్వర్యం జలాలతో నిజాంసాగర్ ప్రాజెక్టును నింపనున్నారు. దీంతో ఇక్కడి రైతాంగానికి శాశ్వత సాగునీటి పరిష్కారం చూపే దిశగా వేసిన అడుగులు సఫలీకృతం అయ్యాయి. కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలను హల్దీవాగులోకి మళ్లించి, అక్కడి నుంచి మంజీర ద్వారా నిజాంసాగర్ను నింపనున్నారు. ఇటీవలే సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డితోపాటు ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రజాప్రతినిధులతో కలిసి సంగారెడ్డి కెనాల్ ద్వారా నీటిని మంజీరకు వదిలారు. అవి ఇప్పటికే హల్దీ ప్రాజెక్టును నింపాయి. మరో వారంరోజుల్లో నిజాంసాగర్ ప్రాజెక్టును ముద్దాడనున్నాయి. ప్రాజెక్టు నిండితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సస్యశ్యామలం కానుంది.