హైదరాబాద్ : సికింద్రాబాద్ పార్లమెంట్ సీటును ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోబోతున్నదని, స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి ఎంఎన్.శ్రీనివాస్తో పాటు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రెండు గంటల పాటు నాయకులతో చర్చించారు.
వివిధ సర్వే సంస్థల అంచనాలను నాయకులకు వివరించారు. సికింద్రాబాద్ పార్లమెంట్లో సిట్టింగ్ బీజేపీ ఎంపీ కిషన్రెడ్డి మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుకు (Padmarao Goud) మద్దతు పలుకుతామని ఓటర్లు చెబుతున్నారన్నారు. బీఆర్ఎస్ పోటీ బీజేపీతోనే అని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ మూడో స్థానానికే పరిమితం కానున్నట్లు అన్ని సర్వేలలో(Surveys) తేలిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పట్ల మొగ్గు కనిపిస్తోందని, ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్కు దక్కనున్నాయని వివరించారు. పోలింగ్ ముగిసేదాకా బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్రనేత కే.విప్లవ్ కుమార్, నియోజకవర్గం ఇన్చార్జి మన్నె గోవర్ధన్రెడ్డి, కార్పొరేటర్లు వెల్దండ వెంకటేష్, మన్నె కవితారెడ్డితో పాటు అన్ని డివిజన్ల బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.