Hyderabad | హైదరాబాద్లో భారీ మోసం బయటపడింది. భారతీ లేక్ వ్యూ ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మోసానికి పాల్పడ్డ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంపల్లిలో తక్కువ ధరకే ప్లాట్లు అంటూ నమ్మించి కోట్లు దండుకున్న భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజును అరెస్టు చేశారు. నాగరాజుతో పాటు ఎండీ శివరామకృష్ణ, సీఈవో నరసింహారావును కూడా అరెస్టు చేశారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో భారతీ లేక్వ్యూ పేరుతో భారతీ బిల్డర్స్ ఒక ప్రాజెక్టును చేపట్టారు. ఈ సందర్భంగా ప్రీలాంచ్ పేరుతో ఒక ఆఫర్ను ప్రకటించారు. 6.23 ఎకరాల్లో తమ సంస్థ చేపట్టబోయే ఈ నిర్మాణంలో ఒక చదరపు అడుగుకు కేవలం రూ.3200 మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపారు. కొంపల్లిలోని వెంచర్ సైట్తో పాటు మాదాపూర్లోని ఆఫీసుల్లో కస్టమర్లతో ప్రత్యేక సమావేశాలు చేపట్టి వాళ్లను నమ్మించారు. వీళ్ల ఆఫర్ను నమ్మిన దాదాపు 350 మంది నుంచి రూ.80 కోట్ల వరకు వసూలు చేశారు. కానీ ఇప్పటివరకు నిర్మాణం చేపట్టలేదు. దీంతో భారతీ బిల్డర్స్పై సైబరాబాద్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భారతీ బిల్డర్స్ చైర్మన్, ఎండీ, సీఈవోలను అరెస్టు చేశారు.