నిత్యం 20 వేల మందికి పైగా హాజరు
వ్యవసాయ పనులు ముగియడమే కారణం!
పంచాయతీకి 100 మందికి పైగా పనికి..
30 శాతం వేసవి భత్యం పెంచిన సర్కారు n పనిస్థలాల్లో కరోనా నిబంధనలు అమలు
ఆదిలాబాద్, ఏప్రిల్ 2( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ పనులు ముగియడంతో, ఉపాధిహామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నిత్యం 20 వేల మంది కూలీలు పనులకు వస్తుండగా, సోమవారం నుంచి అధికారులు ప్రతి పంచాయతీలో 100 మంది కూలీలకు తగ్గకుండా చూస్తున్నారు. గతేడాది 78 శాతం లక్ష్యాన్ని చేరుకోగా, ఈసారి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఎక్కువ పనులు పూర్తి చేసేందుకు కూలీల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇప్పటికే వేసవిలో ఉపాధి భత్యం 30 శాతం అదనంగా పెంచగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు డీఆర్డీఏ అధికారులు చెబుతుండగా, ఆయా చోట్ల ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 1,63,836 ఉపాధిహామీ జాబ్కార్డులు ఉండగా, 3,40,000 మంది కూలీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 90 వేల మంది కూలీలు ఏటా సక్రమంగా ఉపాధి పనులకు హాజరవుతున్నారు. జిల్లాలో వానకాలంలో పంటల సాగు ఎక్కువగా ఉండడంతో గ్రామాల్లో కూలీలు వ్యవసాయ పనులకు వెళ్తారు. యేటా యాసంగి సీజన్ తర్వాత మార్చి, ఏప్రిల్, మే నెలలో ఉపాధిహామీ పనులకు వచ్చే కూలీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గతేడాది కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో పట్టణాల్లో పరిశ్రమలు, భవన నిర్మాణాల్లో కార్మికులుగా పనిచేసే వారు గ్రామాలకు చేరుకొని ఉపాధి పనులు చేసుకున్నారు. అధికారులు కొత్త గా 4 వేల జాబ్కార్డులు జారీ చేసి ఇత ర ప్రాం తాల నుంచి వచ్చిన వారికి సొంత గ్రామాల్లో పనులు కల్పించారు. గతేడాది జిల్లాలో 73 లక్షల పనిరోజులు కాగా, 78 శాతం నిర్దేశిత లక్ష్యా న్ని పూర్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రార ంభమై 3 రోజులు కావడం, వేసవిలో పనులకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో కూలీల సంఖ్యను పెంచడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతి పంచాయతీకి 100 కూలీలు
ఉపాధి పనులు చేసే కూలీల సంఖ్య పెంచడంలో భాగంగా అధికారులు పకడ్బందీ ప్రణాళికలు తయారు చేశారు. ప్రస్తుతం జిల్లాలో నిత్యం 20 వేల మంది పనులు చేస్తున్నారు. జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రతి పంచాయతీ నుంచి 100 మంది కూలీలు హాజరయ్యేలా చర్యలు చేపట్టారు. మరోవారం తర్వాత ప్రతి పంచాయతీకి 200 మంది కూలీలు పనులకు వచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉపాధిహామీ ఏపీవోలు, పంచాయతీల కార్యదర్శులు గ్రామాల్లో పర్యటిస్తూ కూలీల సంఖ్య పెరిగేలా చూస్తారు. యేటా ఎండాకాలం సీజన్లో 80 వేల నుంచి 90 వేల మంది వరకు పనులకు వస్తారని, వీరందరికీ ఉపాధి కల్పిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్, మే నెలలో ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలకు అదనంగా 30 శాతం భత్యం చెల్లిస్తున్నది. దీంతో పనులు చేసేందుకు గ్రామాల్లో స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు వ్యవసాయ పనులు ముగియడం కూడా ఉపాధి కూలీల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తున్నది.
కరోనా నిబంధనలు
జిల్లాలో ఉపాధి పనులు జరిగే చోటా కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి కూలీ మాస్క్ ధరించడంతో పాటు పనిచేసే చోట శానిటైజర్ను అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. పనుల్లో కూలీలు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశామన్నారు. కూలీలకు నీడ సౌకర్యం కల్పిస్తున్నామని, ఎండల తీవ్రత కారణంగా ఉదయం సమయంలో పనులకు రావాలని అధికారులు కోరుతున్నారు.
నీటి సంరక్షణకు ప్రాధాన్యం..
జిల్లాలో ఉపాధిహామీ పనిరోజుల నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నాం. ఏప్రిల్, మే నెలల్లో పనులకు డిమాండ్ ఉంటుంది. ఈ నెలల్లో కూలీల సంఖ్య పెరుగుతుంది. ఈ సారి నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. చెరువుల పూడికతీత, బండింగ్, సీసీటీలు, డైవర్షన్ డ్రెయిన్లు, ఫాంపాండ్ల పనులు నిర్వహిస్తున్నాం.