జనగామ, జూలై 9 (నమస్తే తెలంగాణ) : పల్లె ప్రగతితో జనగామ మండలంలోని శామీర్పేట గ్రామం అభివృద్ధి బాట పట్టింది. ప్రతి వీధిలో సీసీరోడ్లు, అండర్ డ్రైనేజీల నిర్మాణం, సీసీ కెమెరాలు, ప్రధాన వీధుల్లో ఎల్ఈడీ లైట్లతో సరికొత్తగా కనిపిస్తోంది. పవర్వీక్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా థర్డ్లైన్ ఏర్పాటు చేసి వీధుల్లోని స్తంభాలకు ఎల్ఈడీ బల్బులు అమర్చడంతో చీకటి కష్టాలు పోయాయి.
అలాగే వంగిపోయి ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, వేలాడే కరంటు తీగలను సరిచేయడంతో పాటు ఇనుప స్తంభాల స్థానంలో సిమెంట్ పోల్స్ అమర్చడం వల్ల విద్యుత్ సమస్యలు తీరిపోయాయి. అలాగే పాత బావులు, శిథిలమైన ఇండ్లను కూల్చేశారు. హరితహారంలో భాగంగా నర్సరీని ఏర్పాటు చేసి, వీధివీధిలో విరివిగా మొక్కలు నాటారు. రైతులతో పెద్దఎత్తున చింత మొక్కలు నాటించారు.
ఆకట్టుకునేలా రాక్గార్డెన్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం..
గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మొదట పార్కు కోసం స్థలం వెతికినా అనువైనది దొరకకపోవడంతో పెద్దగుట్ట ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ పిచ్చిమొక్కలు, పెద్దపెద్ద రాళ్లు ఉన్నప్పటికీ పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి చొరవతో ఇప్పుడు అందమైన పార్కుగా మారింది. బండరాళ్లకు రంగులతో పాటు అందమైన చిత్రాలు, సందేశాత్మక సూక్తులు రాయించారు. అలాగే గుట్ట చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయించి తీరొక్క రంగు పూలు, పండ్ల మొక్కలు నాటడంతో సందర్శకులను కట్టిపడేస్తోంది.
గ్రామస్తుల సమష్టి సహకారంతోనే..
పల్లె ప్రగతి పనులకు గ్రామస్తుంతా సహకరిస్తున్నారు. పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం నిర్దేశించిన పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తున్నాం. పల్లె ప్రకృతి వనాన్ని ఆహ్లాదకరంగా.. అందంగా తీర్చిదిద్దాం. ఉదయం, సాయంత్రం పిల్లలతో సందడిగా కనిపిస్తోంది.