KTR | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని ఇక అయిపోయినట్లే అని.. ఇదే అంశం రేవంత్ రెడ్డి చేయించుకున్న సొంత సర్వేలోనూ తేలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తన పరిపాలనపైన, తన నాయకత్వంపైన, సగం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒక విస్తృత సర్వేను చేయించుకున్నారని, అందులోనూ ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా వ్యక్తమైందన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇంచార్జ్లు, ఎస్ఐఆర్ (SIR) కమిటీ నేతలు హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎస్ఐఆర్ (SIR) పై ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలు, అలాగే పార్టీ పరంగా చేయాల్సిన సూచనలపై ఈ సందర్భంగా సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితి సుమారు 78 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ సర్వేలో తేలిందన్నారు. దీంతో పాటు రెండు మీడియా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగాలు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే అంశం వ్యక్తమైందన్నారు. మరోసారి ప్రజలు కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని స్పష్టంగా తమ అభిప్రాయం చెప్పిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. అయితే తన సొంత సర్వేతో పాటు పలు సర్వేల్లో వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే ముఖ్యమంత్రి గత వారం రోజులుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. దీంతోపాటు తన పరిపాలన వైఫల్యాలను ముఖ్యంగా కప్పిపుచ్చుకునేందుకు అనేక అటెన్షన్ డైవర్షన్ పనులు చేస్తున్నారని, అందులో భాగంగానే కాళేశ్వరం నుంచి మొదలుకొని రైతుబంధు వరకు అన్నింటిపైన అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశమే లేదు..
కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని, సగం పరిపాలనా కాలం ముగిసిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఇచ్చిన గ్యారంటీల అమలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైనందు వల్లనే తెలంగాణలోని సబ్బండ వర్గాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలనపై నమ్మకం కోల్పోయారన్నారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా స్పష్టంగా ప్రజలు బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నారని, బీజేపీ లాంటి ఇతర పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేరన్నారు.
కాంగ్రెస్ పార్టీ జారుడు బండపైన నిలబడిందని, ఇక పుంజుకునే అవకాశమే లేదన్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల అబద్ధాలు చెప్పినా, ప్రజలను మోసం చేయాలని చూసినా కాంగ్రెస్ పార్టీ ముందు ముందు ప్రజామోదం పొందడం అత్యంత కష్టమన్నారు.