కవాడిగూడ, జూలై 11: ఆషాఢమాస బోనాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పోతరాజుల విన్యాసాలు, డప్పువాయిద్యాల నడుమ లోయర్ ట్యాంక్బండ్లోని శ్రీ కనకాల కట్టమైసమ్మ అమ్మవారికి తొలిబోనం సమర్పించారు… తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కుమ్మరులు బోనాల జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. వందలాది మంది మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్స్… వర్షాన్ని సైతం లెక్కచేయకుండా లోయర్ ట్యాంక్బండ్లోని జగదీష్ మందిర్ నుంచి ట్యాంక్బండ్ మీదుగా శ్రీ కనకాల కట్టమైసమ్మ అమ్మవారి ఆలయం వరకు బోనాలతో భారీ ప్రదర్శనగా వచ్చి.. అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి.. భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు.
ఈ బోనాల ఉత్సవాలకు రాష్ట్ర పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, గోపీనాథ్, కవాడిగూడ కార్పొరేటర్ గోడ్చల రచనశ్రీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే బోనాల పండుగలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే బోనాల పండుగను సీఎం కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారికంగా నిర్వహించడం ఎంతో గొప్పతనమన్నారు. తొలి బోనం ఉత్సవాలకు ప్రభుత్వం రూ. 5లక్షలు కేటాయించిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కుమ్మరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ.. వారికి అండగా నిలుస్తుందన్నారు. ఉత్సవాలకు వచ్చిన కుమ్మరుల ఆడబిడ్డలకు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నిర్వాహకులు మంత్రి, ఎమ్మెల్యేలను పూల మాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బోనా ల ఉత్సవ కమిటీ చైర్మన్ నాగపూరి నాగేశ్వర్, రాష్ట్ర అధ్యక్షుడు నడికుడ జయంత్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయానంద్, అసోసియేట్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఉత్సవ కమిటీ కో-కన్వీనర్లు నిమ్మలూరి శ్రీనివాస్, నెదునూని శ్రీనివాస్, రాధారవు లక్ష్మి, హనుమాన్ టెంపుల్ మాజీ చైర్మన్ హనుమంతరావు, నాయకులు ముఠా జయసింహ, వల్లాల శ్యామ్యాదవ్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, కల్వ గోపి, ముచ్చకుర్తి ప్రభాకర్ పాల్గొన్నారు.