Jaya Prakash Narayana | వందేండ్ల ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ మహానగరం చుట్టూ మెట్రో మణిహారానికి రూపకల్పన చేస్తే.. వంద బస్సులు చాలు అంటూ కుటిల బుద్ధితో విషపు కూతలు కూసిన కూకట్పల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణపై తెలంగాణ మేధావులు, సామాజిక వేత్తలు మండిపడుతున్నారు. చంద్రబాబు ఆలోచనా విధానంతోనే తెలంగాణపై జేపీ విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన జేపీ.. అభివృద్ధిని చూసి ఓర్వలేక అక్కసుతోనే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేధావి ముసుగులో పిచ్చి కూతలు మానుకోవాలని, లేదంటే తెలంగాణ తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.
సిటీబ్యూరో, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ) : ప్రపంచ దేశాలు మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను కల్పించేందుకు మెట్రో వైపు పరుగులు తీస్తున్నాయి. అందుకు దీటుగా హైదరాబాద్ను అభివృద్ధి చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ శివారు ప్రాంతాలకు మెట్రో విస్తరణకు నిర్ణయించింది. దీంతో తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మేధావిగా చెప్పుకునే ఆంధ్ర నాయకుడు, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి, తన లోక్సత్తా పార్టీ దుకాణాన్ని తెలంగాణలో మూసేసి ఆంధ్రాకే పరిమితమైన జయప్రకాశ్ నారాయణ మెట్రో విస్తరణపై వివాదాస్పదంగా మాట్లాడటంపై యావత్తు తెలంగాణ ఆయన మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. హైదరాబాద్ అభివృద్ధిని జీర్ణించుకోలేక మెట్రోపై ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న అధికారులు, రిటైర్డు అధికారులు పేర్కొంటున్నారు. మెట్రో అవసరమేమిటో ఆయా అధికారులు వివరిస్తూ, జయ ప్రకాశ్ నారాయణ తప్పుగా మాట్లాడటం సరికాదంటున్నారు.
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థ బాగుండాలి.. రోజు రోజుకు హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది.. రద్దీ లేకుండా సాఫీగా నగర రోడ్లపై వాహనాలు సాగిపోవాలంటే ప్రజా రవాణా వ్యవస్థ బాగుండాలి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సమయం వృథా కాకుండా వేగంగా ప్రయాణించాలంటే మెట్రో రైలుతోనే సాధ్యమవుతుంది. శివారు ప్రాంతాలను, నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ మెట్రో మార్గాలున్నప్పుడు రోడ్లపై ట్రాఫిక్ తగ్గుతుంది. ప్రతి ఒక్కరూ సునాయసంగా ప్రయాణం చేయగలుగుతారు. దీనిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం నగర శివారు ప్రాంతాలకు మెట్రోను విస్తరించి, నగరం నలుమూలలా మెట్రో కనెక్టివిటీని మరింతగా పెంచేందుకు నిర్ణయించింది. హైదరాబాద్ అభివృద్ధిని చూసి తట్టుకోలేని కొందరు ఆంధ్రా మేధావులు.. ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్ట్లపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. హైదరాబాద్లో బస్సులు పెంచి, రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలని ఉచిత సలహాలిస్తున్నారు. ప్రస్తుతమున్న బస్సులతోనే ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది, మరిన్ని పెంచితే నగరంలో ట్రాఫిక్ అస్థవ్యస్తమవుతుంది. దీనిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మెట్రోనే మెరుగైన రవాణా వ్యవస్థ అని ప్రపంచ దేశాలకు దీటుగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తున్నదని పలువురు రిటైర్డు అధికారులు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
లండన్లో సక్సెస్.. ఇక్కడ కాలేమా..?
హైదరాబాద్లో మెట్రో ప్రారంభమైనప్పుడు అందులో ఎవరు వెళ్తారన్న వాళ్లు చాలా మంది ఉన్నారు. నేడు మెట్రోలో 5 లక్షల మంది ప్రయాణిస్తూ నగరంపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ఈ ప్రజారవాణా వ్యవస్థ పనిచేస్తున్నది. మెట్రోతో వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గింది. అదే శివారు ప్రాంతాలకు విస్తరించడం వల్ల శివారు ప్రాంతాలలో ఉండే వాళ్లు మెట్రో సేవలనే ఎక్కువగా ఉపయోగించుకుంటారు. సమయం ఆదా అవుతుంది. నిరంతరాయ ప్రయాణాలు చేసే అవకాశం ఉండటంతో ప్రజలు మెట్రో వైపే మొగ్గు చూపుతారు. అమెరికా, లండన్, కెనడా దేశాలలో అక్కడి ప్రభుత్వాలు మెట్రోతోనే ప్రజారవాణా వ్యవస్థ సేవలు అందిస్తున్నాయి. లండన్లో 10 ఏండ్లలో మెట్రో సేవలు విస్తరించి, అక్కడ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సెక్సెస్ అయ్యారు. ఉన్నతాధికారుల నుంచి సామాన్య మానవుల వరకు మెట్రోలో సేవలు ఒకే రకంగా ఉంటాయి. దీంతో విదేశాలలో వ్యక్తిగత వాహనాలను పక్కన బెట్టి మెట్రో సేవలను విపరీతంగా ఉపయోగించుకుంటున్నారు. నేడు ఢిల్లీలో మెట్రో లేకుంటే అక్కడి ప్రజల జనజీవనం ప్రశ్నార్థకంగా మారేది. ప్రతి రోజు 28 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేస్తున్నారంటే అన్ని వ్యక్తిగత వాహనాలకు, బస్సులకు ప్రత్యామ్నాయంగా మెట్రో సేవలు అందిస్తున్నట్లే.
మెట్రో ఎందుకు అవసరమంటే..!
ప్రస్తుతం ఎల్బీనగర్ నుంచి కూకట్పల్లికి వెళ్లాలంటే మెట్రోలో 45 నిమిషాల సమయం పడుతుంది. బస్సులో వెళ్లాలంటే ఖచ్చితమైన సమయం ఉండదు. ట్రాఫిక్ రద్దీని బట్టి రెండు గంటలకుపైగానే బస్సులో అక్కడకు చేరుకోవడానికి సమయం పడుతుంది. బస్సులో 60 మందిని తీసుకెళ్లేందుకు అవకాశముంటుంది. మెట్రోలో ఒకేసారి 1500 నుంచి 1800 మంది ప్రయాణానికి అవకాశముంటుంది. ఇంత మంది ప్రయాణికులను రోడ్డు మార్గంలో బస్సులో తీసుకెళ్లాలంటే 30 బస్సులు కావాలి. ఆ బస్సుల నుంచి వెలువడే కాలుష్యం ఎంత.? వాటితో ట్రాఫిక్ రద్దీ ఎలా ఉంటుంది.? అందులో ప్రయాణికుల గమ్యస్థానాన్ని నిర్ణీత సమయంలో చేర్చలేని పరిస్థితి. ప్యూయల్ ఖర్చు.. ఇలా ఎన్నో సమస్యలు రోడ్డుపై వెళ్లే బస్సుల ద్వారా ఉంటుంది.
వాహనాలు రెట్టింపయ్యాయి..
జీహెచ్ఎంసీ పరిధిలో 9250 కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా, అందులో ప్రధాన రోడ్లు, ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాలు 10 ఏండ్ల కిందట 8.5 శాతం ఉండేవి. తెలంగాణ వచ్చిన తరువాత వివిధ అభివృద్ధి పనులు, కనెక్టివిటీ రోడ్లతో వాటిని 10 శాతం వరకు పెంచారు. అలాగే ఫుట్పాత్లను కూడా విస్తరించారు. ముంబైలో కూడా ఉన్న రోడ్లలపై 10, చెన్నైలో 12.5 శాతం ప్రధాన రోడ్ల వాడకం ఉంది. 2014కు ముందు సుమారు 40 లక్షల వాహనాలుండగా, 2022 నాటికి వాటి సంఖ్య 80 లక్షలకు పెరిగింది. అంటే 8 ఏండ్లలోనే రెట్టింపుగా వాహనాలు పెరిగాయి.
అవకాశమున్నచోట రోడ్ల విస్తరణ
హైదరాబాద్లో రోడ్ల విస్తరణకు అవకాశమున్న చోట ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. దీంతోనే వాహనాల సంఖ్య రెట్టింపవుతున్నా ప్రస్తుతం ప్రధాన నగరంలో ట్రాఫిక్ రద్దీ అంతగా లేకుండా సాఫీ ప్రయాణానికి అనువైన వాతావరణం ఉంది. వీలైనన్ని చర్యలు తీసుకోవడంతో వాహనాల రద్దీ ఏర్పడకుండా నిరంతరం ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇది ప్రధాన నగరంపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా కాపాడుతున్నది. అయితే ఇది భవిష్యత్తులో కష్టంగా మారనున్నది. పరిస్థితి ఇలానే ఉంటే కోర్ సిటీపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఔటర్ చుట్టూ, శివారు ప్రాంతాలకు మెట్రోను విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో 20 ఏండ్ల కిందట మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. నేడు ప్రతి రోజు 28 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. భవిష్యత్తులో హైదరాబాద్లో మెట్రో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగనున్నది.
జయప్రకాశ్.. ట్రాఫిక్..కాలుష్యాన్ని పెంచాలా.?
ప్రజా రవాణా వ్యవస్థలో నేడు మెట్రో రైలు కీలకంగా మారింది. కాలుష్య రహితంగా, ఎక్కువ మందికి, నిర్ణీత సమయంలో ప్రజలను గమ్యస్థానాలకు చేర్చుతూ, ఆర్థిక భారం ఎక్కువగా లేకుండా సామాన్యులకు ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తున్నది. అలాంటిది మెట్రో సేవలపై అవగాహన లేకుండా ఆంధ్రా మేధావి జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతున్నారని ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న, పనిచేసిన పలువురు అధికారులు మండిపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్లో మెట్రో సేవలు ఎలా ఉన్నాయి, విస్తరణ జరగడం వల్ల ఎలా ఉపయోగపడుతుందని ఆలోచన చేయాల్సిన మేధావి, బస్సులు పెంచాలంటూ కాలుష్యాన్ని, ట్రాఫిక్ను పెంచే విధంగా మాట్లాడడం ఆయనకు తగదని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో ప్రజా రవాణా వ్యవస్థ నెట్వర్క్ను పెంచిందనే విషయాన్ని గుర్తించి, ఆయన మాటలను సరిదిద్దుకోవాలని సూచించారు.
అక్కసుతోనే జేపీ మాట్లాడారు..!
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లో మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉంది. మెట్రో విస్తరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది. నగరం నాలువైపులా రవాణా సౌకర్యం మెట్రో ద్వారా విస్తరిస్తుంది. ప్రస్తుతం అందిస్తున్న మెట్రో సేవల వల్ల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడింది. మెట్రో విస్తరణ జరిగితే హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుంది. దేశ వ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి మంచి గుర్తింపు ఉంది. దీనికి తగ్గట్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలతో ప్రజలకు మంచి జరుగుతుంది. హైదరాబాద్ నగరం నాలువైపులా అభివృద్ధి చెందిన క్రమంలో తప్పని సరిగా రవాణా సౌకర్యం మెరుగు పర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకునే కొందరు పక్క రాష్ర్టాల నాయకులు వారే మెట్రో విస్తరణపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు. పక్క రాష్ర్టానికి చెందిన వారికి హైదరాబాద్పై మాట్లాడే అర్హత లేదు. ఎదుగుతున్న హైదరాబాద్ అభివృద్ధిని చూడలేక కొందరు అక్కసుతోనే మాట్లాడినట్లు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు.
– చిరంజీవులు, మున్సిపల్ డీఈఈ-దమ్మాయిగూడ, మేడ్చల్
శివారులోనూ మెరుగైన వసతులు
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు తావు లేకుండా, కోర్ సిటీలో వెహికిల్ లోడ్ తగ్గించేలా ప్రభుత్వం పాలసీ విధానాలను దశల వారీగా అమలు చేస్తున్నది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు కోర్ సిటీకే పరిమితమైన మెట్రోను పొడిగిస్తూ.. ఓఆర్ఆర్ వరకు విస్తరించాలనే ప్రణాళికను ఆచరణలో పెడుతుంది. కేవలం వాహనాల లోడ్ తగ్గించడంతోపాటు నగరంలో వాహన కాలుష్యం, ఇంధన వనరులను తగ్గించడానికి సాయపడుతుంది. మెరుగైన వసతులు, రవాణా సౌకర్యాలు ఉంటే ఎక్కడికైనా వెళ్లేందుకు జనాలు మొగ్గుచూపుతారు. దూరంతో సంబంధం లేకుండా శివారులోనూ నివాస ప్రాంతాలు అందుబాటులోకి వస్తాయి.
– డా.జి.వెంకట నర్సింహారెడ్డి, జేఎన్టీయూ సివిల్ ఇంజినీరింగ్ నిపుణులు
జేపీ మేధావి కాదు..తెలంగాణ ద్రోహి
జేపీ మేధావి కాదు.. తెలంగాణ ద్రోహి. నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకొనే ప్రయత్నం చేసి విఫలమై.. నేడు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న రాష్ట్రంపై అక్కసును వెళ్లగక్కుతున్నాడు. ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్టు అవసరం లేదు.. వంద బస్సులు వేస్తే చాలని వ్యాఖ్యానించడం సరికాదు. తొమ్మిదేండ్ల కాలంలో కనీవిని ఎరుగని రీతిలో రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధించింది. తెలంగాణ ఏర్పాటుకు అడుగడుగునా అడ్డుపడిన జేపీ.. నేడు సీమాంధ్ర కుటిల బుద్ధితో అభివృద్ధిపై విష ప్రచారం చేస్తున్నారు. నగరంలో కోటి మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. చుట్టుపక్కల వంద కిలోమీటర్ల మేర అభివృద్ధి చెందిన విషయం జేపీ తెలుసుకుంటే మంచిది. నగరం చుట్టూరా ఓఆర్ఆర్ను ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. ప్రజలకు మెరుగైన సేవలందుతాయన్న విషయం తెలుసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా మారింది.
– పాటిమీది జగన్మోహన్ రావు, టీఎస్టీఎస్ చైర్మన్
దూరదృష్టితో చేపట్టే అభివృద్ధిపై విమర్శలా?
తెలంగాణ ప్రభుత్వం ప్రజా రవాణా కోసం దూరదృష్టితో చేపట్టే పనులను విమర్శించడం బాధ్యతారాహిత్యం. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రో అవసరం లేదని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అనడం సరికాదు. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో తప్పకుండా అవసరం ఉంటుంది. విశ్వ నగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ను క్రమంగా పెంచుతున్నది. జేబీఎస్ నుంచి 25 కిలోమీటర్ల రేడియస్లో మెట్రో అవసరముంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మెట్రోను విస్తరించాలనే ఆలోచన భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరం. వందేండ్ల ముందు చూపుతో ప్రణాళికాబద్ధంగా సాగితే ఇతర రాష్ర్టాల్లోని మెట్రో ప్రాజెక్టులకు ఆదర్శంగా నిలవడం ఖాయం.
– ప్రొఫెసర్ గోపాల్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్
అభివృద్ధిని పెంపొందించేలా మాట్లాడాలి
మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ లాంటి మేధావులు మెట్రో విస్తరణపై చేసిన వ్యాఖ్యలు వారి స్థాయికి తగ్గట్లుగా లేవు. ఔటర్ చుట్టూ, హైదరాబాద్- బీబీ నగర్ వరకు మెట్రో విస్తరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్ప ఆలోచన. ఇలాంటి అభివృద్ధి ఆలోచనను హర్షించాలే కానీ.. అక్కర్లేదు అనడం సమంజసం కాదు. హైదరాబాద్ లాంటి మహానగరం విశ్వనగరం కావాలంటే మెట్రో రైలు విస్తరణ జరగాల్సిందే. తొమ్మిదిన్నరేళ్లలో ప్రభుత్వం నగరంలో ట్రాఫిక్ పరిష్కారం కోసం ప్రజా రవాణా సౌకర్యార్థం అనేక ఫ్లై ఓవర్లను నిర్మించింది. రానున్న కాలంలో మరిన్ని ఫ్లై ఓవర్లతో పాటు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ వంటి వాటి విస్తరణ జరగాల్సిందే. జేపీ లాంటి మేధావులు అభివృద్ధిని పెంపొందించేలా మాట్లాడాలి.. ఆటంకం కలిగించేలా మాట్లాడడం బాధాకరం.
– డాక్టర్ నల్లగుంట్ల యాదగిరి రావు, పట్టణాభివృద్ధి పరిశోధకులు, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్
మెట్రో రైల్ విస్తరణ వృథా కాదు
నగర ప్రజల అవసరాల కోసం చేసే నిధుల ఖర్చు వృథా కావు. అభివృద్ధి కోసం పెట్టే పెట్టుబడిగా భావించుకోవాలి. ఈ పెట్టుబడి వల్ల తిరిగి ప్రభుత్వాలకు రాబడి ఉంటుంది. ఈ రాబడి అనేది కేవలం మెట్రో రైలు టిక్కెట్ల రూపంలోనే కాదు. పలు మార్గాల ద్వారా ఉంటుంది. అభివృద్ధి లేకుం డా రాబడి ఉండదు. ఇలాంటి విషయాలు మరిచిపోయిన కొందరు మెట్రో రైలు విస్తరణ నిర్ణయం సరియైనది కాదని ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కచ్చితంగా వారికి హైదరాబాద్ అభివృద్ధి చెందవద్దనే దురుద్దేశం ఉందని చెప్పొచ్చు. గతంలో జేపీకి ఇలాంటి అనుభవం ఉన్నప్పటికీ ఆయన మెట్రో విస్తరణపై వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి తగదు. సింగపూర్, మలేషియా వంటి దేశాల్లోని పలు నగరాలలో ఒక్కరోజు మెట్రో రైలు నిలిచిపోతే అక్కడి ప్రజా రవాణా కూడా అస్థవ్యస్తమవుతుంది. హైదరాబాద్ ప్రజలు కూడా క్రమంగా మెట్రో రైలు ఆశ్రయిస్తున్నారు. కానీ మెట్రో విస్తరణ వ్యతిరేకిస్తూ.. ఇంకా బస్సులు పెంచాలని కాలుష్యాన్ని ప్రోత్సహించడం వెనుక ఆంతర్యమేమిటో వాళ్లకే తెలియాలి.
– ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, జేఎన్టీయూ వీసీ
జేపీ కుంచితత్వం ఏందో అర్థమవుతుంది
హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా పేరు సంపాదించుకున్నది. ‘హై వాల్యూ సిటీ’ గా హైదరాబాద్ కు స్థానం దక్కింది. ఇలాంటి నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన ఫండమెంటల్ రైట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందులో భా గంగా సీఎం కేసీఆర్ ఇతర రంగాల అభివృద్ధితో పాటు ప్రజా రవాణాను అభివృద్ధి చేస్తున్నారు. నగరంలో మంచి ఆదరణ పొందిన మెట్రో రైలును నగర శివార్లకు కూడా విస్తరించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హర్షనీయం. ఇలాంటి బృహత్తర ప్రణాళికను విమర్శించడమంటే జేపీ కుంచితత్వం ఏందో అర్థమవుతుంది. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం.. మౌలిక వసతులు ఒకేచోట ఏర్పాటు చేయడం చాలా ప్రమాదకరం. గతంలోని పాలకులు చేసిన ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకే సీఎం కేసీఆర్ ముందుచూపుతో మెట్రో ప్రణాళిక తెచ్చారు. ప్రపంచ నగరాల్లో ప్రజా రవాణాను బలోపేతం చేయాలని మేధావులు డిమాండ్ చేస్తారు. కానీ జేపీ అందుకు భిన్నంగా వ్యాఖ్యానించడం విడ్డూరం.
– ప్రొఫెసర్ సీతారామారావు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవద్దు
తెలంగాణ అభివృద్ధిని ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయవద్దు. నగరాల అభివృద్ధికి మెట్రో రైలు వంటి ప్రజా రవాణాలు అత్యంత కీలకమైనవి. నిజమైన పాలకులు భవిష్యత్తులో నగర అభివృద్ధిని అంచనా వేస్తూ ప్రణాళికలు రూపొందిస్తారు. సీఎం కేసీఆర్ కూడా అదే పని చేశారు. కానీ మేధావి ముసుగులో జేపీ ఇదో తెల్ల ఏనుగు అనే రీతిలో వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఇలాంటి ప్రణాళికలు అభివృద్ధిలో భాగంగా కొనసాగించాల్సిన నిరంతర ప్రక్రియ. అభివృద్ధి అనేది నగరం నడిబొడ్డుకే పరిమితం చేయొద్దు. కాలానుగుణంగా.. ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నగరాల అభివృద్ధిని కొనసాగిస్తుండాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రజా అనుకూలంగా మారుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి నగరాలు ఇదే క్రమంలో అభివృద్ధి జరుగుతున్నాయన్న సంగతిని ఎవరూ మరిచిపోవద్దు. మెట్రో వల్ల సాధారణంగా ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు నగరానికి అలంకారం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితులను తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
– ప్రొఫెసర్ గోపాల్రెడ్డి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ