సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగురోడ్డు చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతమైంది. ఈ ప్రాంత అభివృద్ధిపై హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రాజేంద్రనగర్ సమీపంలోని బుద్వేల్ రెవెన్యూ పరిధిలో సుమారు 180 ఎకరాల ప్రభుత్వ భూమిని లేఅవుట్ చేసేందుకు చర్యలు చేపట్టింది.
ఒకవైపు ఔటర్ రింగు రోడ్డు, మరోవైపు హిమాయత్సాగర్ జలాశయం సమీపంలో ఈ లేఅవుట్ను అభివృద్ధి చేస్తుండటంతో దీనికి ఎంతో ప్రాధాన్యత నెలకొంది. ఇప్పటికే కోకాపేటలో నియోపొలిస్ పేరుతో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్ తరహాలో భారీ విస్తీర్ణంతో కూడిన రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే మార్గంలో ఉన్న బుద్వేల్ ప్రాంతానికి మంచి డిమాండు ఉందని అధికారులు గుర్తించారు. ఈ లేఅవుట్లో భారీ ఎత్తయిన భవనాలు నిర్మించేందుకు వీలుగా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ఈ మార్గంలో ప్రభుత్వం ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ మార్గాన్ని నిర్మిస్తోంది. ఈ లేఅవుట్ పక్క నుంచే కొత్తగా నిర్మించే మెట్రో మార్గం వెళ్తుండటంతో మంచి డిమాండు ఉంటుందని, ప్లాట్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న బుద్వేల్ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన భూములు ఉన్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఈ ప్రాంతంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులను సైతం చేపట్టాయి. వాటిని ఆనుకొనే ప్రభుత్వ భూములు ఉండటంతో అందులో మొదట 180 ఎకరాల్లో కోకాపేట నియోపొలిస్ లేఅవుట్ మాదిరిగా మల్టీపుల్ యూజ్జోన్గా నిర్ణయించి లేఅవుట్ను చేపట్టారు. ప్రస్తుతం కొండలు, గుట్టలతో కూడిన ఈ స్థలంలో రోడ్లు, ప్లాట్ల మార్కింగ్ కోసం హెచ్ఎండీఏ అధికారులు పనులు నిర్వహిస్తున్నారు.
ఈ లేఅవుట్కు సమీపం నుంచే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రో మార్గం వెళ్తోంది. ఈ ప్రాంతమంతా ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ పరిధిలోనే ఉండటంతో ప్రణాళికాబద్ధంగా రోడ్ నెట్ వర్క్ను అభివృద్ధి చేయనున్నారు. రాజేంద్రనగర్,శంషాబాద్ల మధ్య ఉన్న బుద్వేల్ ప్రాంతం ఔటర్ రింగురోడ్డుతోనూ అనుసంధానమై ఉండటంతో అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ లేఅవుట్లో రోడ్లు, ప్లాట్ల మార్కింగ్ పూర్తయిన తర్వాత ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆగస్టు మొదటి వారంలో కోకాపేట నియోపొలిస్ లేఅవుట్లో రెండో దశ ప్లాట్ల వేలం ముగిసిన తర్వాత బుద్వేల్ లేఅవుట్లో ప్లాట్లను విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గజాల్లో కాకుండా ఎకరా స్థలాన్ని ఒక్కో ప్లాటుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ లేఅవుట్కు సంబంధించిన ప్రణాళికను టౌన్ప్లానింగ్ (పట్టణ ప్రణాళిక) అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్లాట్లను దశల వారీగా విక్రయిస్తూ, లేఅవుట్ను పూర్తి స్థాయిలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేయనుంది.