Gutha Sukender Reddy | సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారశైలిపై మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం, రైతు భరోసా ఎగవేత, సన్నాలకు బోనస్ లాంటి నిర్ణయంపై ఇప్పటికే రైతన్నల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సొంత ప్రభుత్వానికి చురకలంటించారు.
ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్నాలకు బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు నత్తనడకన నడుస్తుందని, నాణ్యత లేని వరి విత్తనాలు రైతులకి ఇస్తున్నారని, రైతు భరోసా అందరికీ అందడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ లేఖలు రాసే అలవాటున్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఈ సారి మాత్రం నేరుగా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రభుత్వాన్ని తప్పు పట్టడం సీఎం రేవంత్ సర్కార్ పనితీరు ఎలా ఉందో మరోసారి అద్దం పడుతుంది. లేఖలకు ప్రభుత్వం నుంచి రిప్లయ్ వస్తున్నా అమల్లోకి రావడం లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.