Rhea Chakraborty | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత ఎదురైన న్యాయపరమైన చిక్కుల నుంచి నటి రియా చక్రవర్తికి మరో పెద్ద ఉపశమనం లభించింది. 2020లో ఆమె అరెస్ట్ సమయంలో స్తంభింపజేసిన (Freeze) ఆమె మరియు ఆమె కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలను తక్షణమే పునరుద్ధరించాలని ముంబైలోని ప్రత్యేక ఎన్డిపిఎస్ (NDPS) కోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక జడ్జి యు.సి. దేశ్ముఖ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అనుసరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం ఒక బ్యాంక్ ఖాతాను సీజ్ చేసిన 30 రోజుల్లోపు సంబంధిత ఉన్నతాధికారుల నుంచి ధృవీకరణ పొందాల్సి ఉంటుంది. అయితే రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు షోవిక్ ఖాతాల విషయంలో NCB అటువంటి నిబంధనలను పాటించలేదని కోర్టు నిర్ధారించింది. సరైన ప్రక్రియను అనుసరించకపోవడం వల్ల ఆ ఖాతాలను అలాగే స్తంభింపజేయడం చట్టవిరుద్ధమని జడ్జి పేర్కొన్నారు.
2020 సెప్టెంబర్లో డ్రగ్స్ కోణంలో రియాను అరెస్ట్ చేసినప్పుడు ఆమెకు చెందిన ఐసిఐసిఐ, యాక్సిస్ మరియు కోటక్ మహీంద్రా వంటి బ్యాంకుల్లోని సేవింగ్స్ మరియు కరెంట్ ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేశారు. ఈ ఖాతాల్లో రియా మరియు షోవిక్ నిర్వహించిన ‘వివిడ్రేజ్ రియాలిటిక్స్’ అనే కంపెనీకి సంబంధించిన ఖాతా కూడా ఉంది. దాదాపు ఆరేళ్ల పాటు ఈ నిధులు అందుబాటులో లేకపోవడంతో తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని రియా తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గత ఏడాది సిబిఐ (CBI) విచారణలో రియాకు క్లీన్ చిట్ లభించిన తర్వాత, ఇప్పుడు బ్యాంక్ ఖాతాల విషయంలో కూడా ఆమెకు అనుకూలంగా తీర్పు రావడం గమనార్హం. ప్రస్తుతం ఈమె ఆర్బీఐ నిబంధనల ప్రకారం తన ఖాతాల నుండి లావాదేవీలు నిర్వహించుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.