చౌరస్తా దాటాలంటే నరకయాతన.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు.. సమయానికి ఆఫీసుకు వెళ్తామో.. లేదో తెల్వని దుస్థితి.. ఐటీ కారిడార్లో జఠిలంగా మారిన ట్రాఫిక్ సమస్యను ప్రభుత్వం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) ద్వారా శాశ్వతంగా తీర్చింది. దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కారిడార్గా ఖ్యాతిగాంచిన ఈ ప్రాంతంలో ఇరుకు రోడ్ల విస్తరణతోపాటు లింకు రోడ్ల నిర్మాణంతో దూర ప్రాంతాలు మరింత దగ్గరయ్యాయి. వీటికితోడు పొడవైన ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, ఆర్వోబీలు అందుబాటులోకి రావడంతో వాహనాలు రయ్యుమని సాగడంతోపాటు ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి.
గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్, సైబర్టవర్స్, నానక్రాంగూడ వేవ్రాక్ ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలకు ప్రధాన కూడలి రాయదుర్గం బయోడైవర్సిటీ జంక్షన్. ఇక్కడ పలు లింకు రోడ్లతోపాటు రెండు ఫ్లై ఓవర్లను నిర్మించారు. ఫలితంగా గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాలకు రాకపోకలు సులువయ్యాయి. విశ్వనగరంగా వడివడిగా అడుగులేస్తున్న హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణ దూరం తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నది.
ఎస్ఆర్డీపీలో భాగంగా వంతెనలు, అండర్పాస్లు, లింక్రోడ్లు నిర్మిస్తున్నది. ముఖ్యంగా ప్రధాన రహదారులపై రద్దీని తగ్గించేందుకు నిర్మిస్తున్న అనుసంధాన రోడ్లు ట్రాఫిక్ సమస్యకు చక్కటి పరిష్కార మార్గాలను చూపిస్తున్నాయి. వీటి వల్ల సమయం ఆదా అవ్వడమే కాదు.. దూరం దగ్గరై.. గమ్యస్థానానికి ప్రయాణం సాఫీగా సాగిపోతున్నది. దశల వారీగా మొత్తం 137కి పైగా రోడ్లను అభివృద్ధి చేయాలని సంకల్పించగా, ఇప్పటివరకు16 లింక్ రహదారులను అందుబాటులోకి తీసుకొచ్చారు.
అమీర్పేట, పంజాగుట్ట, సికింద్రాబాద్, బేగంపేట, కూకట్పల్లి, బాలానగర్ ప్రాంతాల నుంచి వచ్చే వారు హైటెక్ సిటీ సైబర్ టవర్స్ జంక్షన్ దాటాలంటే ఒక్కో వైపు ఉన్న వాహనదారులు 4-6 నిమిషాల పాటు సిగ్నల్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. రెండు లేదా మూడు సార్లు సిగ్నల్ మారితే తప్ప.. ముందుకు కదలలేకపోయేవారు. గచ్చిబౌలి, కొండాపూర్ వైపు నుంచి జూబ్లీహిల్స్, ఎర్రగడ్డ, ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనాలు ఈ కూడలి మీదుగానే వెళ్లాల్సి ఉండేది. దీంతో ఐటీ ఉద్యోగులతో పాటు ఇతర ప్రయాణికులు నిత్యం ట్రాఫిక్ సమస్యతో నిత్యం సతమతమయ్యేవారు.
మాదాపూర్-హైటెక్ సిటీ సైబర్స్ జంక్షన్పై ఉన్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం లింకురోడ్లను అభివృద్ధి చేసింది. సికింద్రాబాద్, బేగంపేట, ఖైరతాబాద్ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా రోడ్ నం. 45, దుర్గం చెరువు పక్క నుంచి, ఆ తర్వాత కేబుల్ బ్రిడ్జి మీదుగా లింకు రోడ్లను నిర్మించారు. మళ్లీ రోడ్ నంబర్. 45 నుంచి మరో లింకు రోడ్డు ముంబై పాత హైవేను కలిపేలా రోడ్ నం.70 మీదుగా రహదారి అభివృద్ధి చేశారు. ఫలితంగా అమీర్పేట నుంచి మైండ్ స్పేస్ సెజ్, రాయదుర్గం, గచ్చిబౌలి వెళ్లే వారంతా దుర్గం చెరువు వంతెనపై నుంచి రాకపోకలు సాఫీగా సాగిస్తున్నారు. దీంతో సైబర్ టవర్స్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ సమస్య గణనీయంగా తగ్గిపోయింది.
ఐటీ కారిడార్లో రహేజే మైండ్ స్పేస్ జంక్షన్ అత్యంత కీలకమైంది. ఈ కూడలి నలువైపులా భారీ ఐటీ కంపెనీలే ఉన్నాయి. అటు మాదాపూర్ సైబర్ టవర్స్ జంక్షన్ నుంచి, ఇటు బయోడైవర్సిటీ, గచ్చిబౌలి రాంకీ టవర్స్, ఇటు దుర్గం చెరువు ఐల్యాబ్స్ వైపుల నుంచి వచ్చే వాహనాలన్నీ ఈ జంక్షన్ వద్ద కలుస్తుంటాయి. దీంతో నలువైపులా ఒక్కసారిగా వచ్చే వాహనాలతో అన్ని దిక్కులా ట్రాఫిక్ జామ్ అవుతుంది. జంక్షన్ దాటాలంటే ఒక్కో వైపు 5-6 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చేది.
మైండ్ స్పేస్ జంక్షన్లో ఉన్న ట్రాఫిక్ రద్దీ పరిష్కారానికి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి (దుర్గం చెరువు వైపు నుంచి రాంకీ టవర్స్ వైపు), మాదాపూర్ నుంచి రాయదుర్గం వైపు అండర్పాస్ను నిర్మించారు. మాదాపూర్ ఇమేజ్ ఆస్పత్రి పక్క నుంచి రహేజా మైండ్ స్పేస్ సెజ్లోకి నేరుగా వచ్చేలా లింకు రోడ్డును, అక్కడి నుంచి రాయదుర్గం, గచ్చిబౌలి, నానక్రాంగూడ వైపు వెళ్లేందుకు వీలుగా నాలెడ్జ్ సిటీలోంచి పాత ముంబై హైవేను కలుపుతూ మరో అనుసంధాన రహదారిని నిర్మించారు. దీంతో మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యకు లింకు రోడ్లు, ఫ్లైఓవర్, అండర్ పాస్ పరిష్కార మార్గాన్ని చూపాయి.