కవాడిగూడ/కంటోన్మెంట్/సుల్తాన్బజార్/ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 29: దళితులను అవమానించిన దళిత వ్యతిరేకి మాజీ మంత్రి ఈటల రాజేందర్తో పాటు ఆయన బావమరిది కొండవీటి మధుసూదన్రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నగర వ్యాప్తంగా దళిత సంఘాలు, టీఆర్ఎస్వీ నాయకుల ఆధ్వర్యంలో గురువారం ఈటల దిష్టిబొమ్మలను దహ నం చేశారు. ఈటల వైఖరికి నిరసనగా టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, ప్రధాన కార్యదర్శి చందు ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం తుంగబాలు మాట్లాడుతూ దళితులను అవమానించిన ఈటల రాజేందర్ను, ఆయన బావమరిది మధుసూదన్రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
దళితులను నమ్మలేమని తిడుతూ ఈటల పౌల్ట్రీ భాగస్వామి కృష్ణారెడ్డితో చేసిన వాట్సాప్ చాట్తో వారి బండారం బయటపడిందని దుయ్యబట్టారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా పదజాలం వాడుతున్నారని మండిపడ్డారు. దళితుల అభ్యున్నతి కోసం వారి ఆత్మబంధువైన ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. దళితులంటే గౌరవం లేని, దళితుల ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని ఈటల రాజేందర్ వక్రబుద్దితో ఆ పథకాన్ని అడ్డుకునేందుకు భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని ఆరోపించారు.
అనంతరం ఓయూజేఏసీ చైర్మన్ డాక్టర్ వీరబాబు, డాక్టర్ కృష్ణ, డాక్టర్ సురేశ్ తదితరుల ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు ఈటల రాజేందర్, అతని కుటుంబ సభ్యులు, మధుసూదన్రెడ్డిలపై ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్గౌడ్, ప్రధాన కార్యదర్శులు సతీశ్, కృష్ణ, నాయకులు భాస్కర్యాదవ్, నాగయ్య, జంగయ్య, ప్రశాంత్, నరేశ్, మదన్, ప్రవీణ్, సత్యనారాయణ, రామకృష్ణ పాల్గొన్నారు. అదేవిధంగా దళితులను అవమానించిన ఈటల దిష్టిబొమ్మను బషీర్బాగ్ చౌరస్తాలో టీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్కుమార్ ఆధ్వర్యంలో దహనం చేశారు.
అదేవిధంగా దళితులను కించపరిచేలా మాట్లాడిన ఈటల కుటుంబ సభ్యులపై కంటోన్మెంట్ వ్యాప్తంగా దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గురువారం కంటోన్మెంట్లో ఎమ్మెల్యే సాయన్న ఆదేశాల మేరకు నియోజకవర్గ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో జేబీఎస్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అదేవిధంగా తెలంగాణ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి పాపయ్య ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా పాపయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని తాము స్వాగతిస్తున్నామని, ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేసి దళితులకు అన్యాయం చేయొద్దన్నారు.
ఈటలతో పాటు బావమర్ది దళితులకు క్షమాపణ చెప్పాలని. లేనిపక్షంలో దళిత వాడలకు ఓట్లు అడగడానికి వస్తే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీనివాస్, నందకిషోర్, పి.యాదగిరి, కృష్ణ, దశరథ, సురేశ్, సాయి లు, నర్సింగ్రావు, ఎస్సీ సెల్ విభాగం నేతలు నళినికిరణ్, గంగారామ్, సంతోష్, తేజ్పాల్, శ్రీకాంత్, శర్విన్, మహేశ్, రాజేశ్, సుధీర్, టీఆర్ఎస్వీ నాయకులు సాయి, ప్రశాంతి, సాగర్, శివ, చందు, శేఖర్, ప్రకాశ్, విజయ్, చంటి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు యూనివర్సిటీ, జూలై 29: అభ్యంతరకర పదజాలంతో ఈటలతో పాటు ఆయన బావమరిది మధుసూదన్రెడ్డి మాదిగ సామాజికవర్గాన్ని తిట్టినందుకు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని టీఎస్జీఎస్సీ మాజీ చైర్మన్ ధరావత్ మోహన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం డీజీపీ మహేందర్రెడ్డిని కలిసి ఆయనకు వినతి పత్రం అందజేశారు.కులం పేరుతో అగ్రవర్ణ అహంకారంతో మాట్లాడిన కొండవీటి మధుసూదన్రెడ్డి అరెస్టు చేసి వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దళితబంధు పథకంతో ఓడిపోతామనే భయంతోనే తనలోని అసహనాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తూ మాదిగలను కించపరుస్తూ మాట్లాడుతున్నారని, వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.