జనగామ రూరల్, ఏప్రిల్ 30 : రైతుల సౌకర్యార్థమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని ఎంపీపీ మేకల కలింగరాజు అన్నారు. మండలంలోని యశ్వంతాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ గండి లావణ్య, ఎంపీటీసీ బాలరాజు, ఏపీఎం నరేందర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
లింగాలఘనపురం : దళారీ వ్యవస్థను రూపు మాపేందుకే ప్రభుత్వం ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని డీఆర్డీఏ పీడీ రాంరెడ్డి అన్నారు. మండలంలోని గుమ్మడవెల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు తేమ శాతం పరిశీలించాలన్నారు. తాలు, మట్టి పెడ్డలు లేకుండా సరి చూసుకోవాలన్నారు. ధాన్యం తీసుకువచ్చే రైతులకు నీడ కోసం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మణికంఠ రైస్ మిల్లు యాజమాన్యం తమపే ఇబ్బందులకు గురిచేస్తోందని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకురాగా వారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. ఆయన వెంట ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్, ఏపీఎం శంకరయ్య, సీసీ శ్రీకాంత్రెడ్డి, వీవోఏ జ్యోతి, రేణుక తదితరులు పాల్గొన్నారు.