Congress Leader | కొండాపూర్, జూలై 1 : చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడు కంది జ్ఞానేశ్వర్పై అత్యాచారం, బెదిరింపులు, బ్లాక్మెయిల్ ఆరోపణలు నమోదవడం సంచలనం రేపుతోంది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాధిత మహిళతో పరిచయం పెంచుకున్న కంది జ్ఞానేశ్వర్ ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం మహిళకు సంబంధించిన నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని చెబుతూ, వాటిని బయటపెడతానంటూ బెదిరించి మానసికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాకుండా వివిధ అవసరాల పేరుతో మహిళ నుంచి డబ్బులు తీసుకుని, తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు బెదిరింపులకు దిగినట్లు కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె చందానగర్ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేసి నిందితుడు కంది జ్ఞానేశ్వర్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. బాధితురాలు చేసిన ఆరోపణలపై ఆధారాలు సేకరిస్తున్నట్లు, కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా కంది జ్ఞానేశ్వర్ పేరు గతంలో కూడా వివాదాల్లో నిలిచింది. ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసు కూడా అతనిపై నమోదైంది.