‘నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి అరకొరే. ఉండాల్సినంత గొప్పగా, హైదరాబాద్లో ప్రచారం ఉన్నంత బాగా ఇక్కడి పరిస్థితి లేదు’ అంటూ గత పాలకుల నిర్వాకాన్ని ఎండగట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సాగర్ సమగ్రాభివృద్ధికి శ్రీకారం చుట్టారు. హాలియా వేదికగా సోమవారం నిర్వహించిన నియోజకవర్గ ప్రగతి సమీక్షలో డొంక దారుల్లోని కల్వర్టుల నుంచి.. మున్సిపాలిటీల అభివృద్ధి వరకూ భరోసా ఇచ్చారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్య, వైద్యం, ఎత్తిపోతల పథకాలు, కృష్ణా-గోదావరి అనుసంధానం.. ఇలా ప్రతి అంశంపైనా భవిష్యత్ ప్రణాళికను వివరించారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఇక్కడి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి వచ్చిన ముఖ్యమంత్రి.. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి, వసతుల కల్పనకు 150 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికి కూడా తీసిపోకుండా నాగార్జునసాగర్ను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
హాలియా, నందికొండ మున్సిపాలిటీకి ఇచ్చిన ప్రత్యేక నిధులతో పక్కాగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలె. అవసరమైతే మున్సిపల్ శాఖ మంత్రి, సీనియర్ అధికారులను రప్పించి మంత్రి జగదీశ్రెడ్డి దగ్గరుండి ప్రణాళిక సిద్ధం చేయాలె. అందరినీ హైదరాబాద్ పిలిపించి నేను కూడా మాట్లాడుతా.
మిర్యాలగూడ రోడ్డులో హెలికాప్టర్ దిగిన ముఖ్యమంత్రి.. బస్సు ఎక్కి
పావుగంట పాటు హాలియా పట్టణాన్ని చూసుకుంటూ సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణులతోపాటు అభిమానులు, నియోజకవర్గ ప్రజలు దారిపొడవునా ఘన స్వాగతం పలికారు. దళితబంధు పథకంపై సంతోషం వ్యక్తం చేస్తూ వెయ్యి డప్పులతో దళితులు హోరెత్తించారు.
హెలికాప్టర్లో వస్తే గాల్లో రావడం, గాల్లో పోవడం లాగా ఉంటుంది. ఊరు చూస్తేనే సమస్య అర్థమవుతదని రోడ్డు మార్గంలో వచ్చిన. మొన్నటి వరకు గ్రామపంచాయతీగా ఉంది కాబట్టి, సరైన డ్రెయిన్లు లేవు. రోడ్లు గూడ బాగలేవు. హాలియాను మనం అద్భుతంగా తయారుచేసి చూపెట్టాలె.