రామగిరి, ఏప్రిల్ 12: నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం వాసవీ క్లబ్-యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీప్లవ నామ సంవత్సర పంచాంగాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా వైశ్యులకు సముచిత స్థానం కల్పించి నామినేటెడ్ పదవులు ఇచ్చారని తెలిపారు. త్వరలో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు జరుగనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వాసవీక్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ, యామా దయాకర్, బండారు వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ, వాసవీక్లబ్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పోకల వెంకన్న, మంచాల ప్రభాకర్, తాటిపల్లి రవీందర్, సీనియర్ జర్నలిస్టు బోయినపల్లి జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.
వైదిక బ్రాహ్మణ సంఘం కార్యాలయంలో..
శ్రీప్లవ నామ సంవత్సర పంచాంగాన్ని నల్లగొండలోని వైదిక బ్రాహ్మణ సంఘం కార్యాలయంలో ధూప, దీప, నైవేద్య సంఘం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దౌలాతాబాద్ వాసుదేవ శర్మ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అంశం పంచాంగంతో అనుసంధానమై ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం చైర్మన్ డాక్టర్ పోతులపాటి రామలింగేశ్వర శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడుగంటి వెంకటరమణ శర్మ, ప్రధాన కార్యదర్శి కోట్ర సతీశ్శర్మ, జి.లక్ష్మీనర్సయ్య శర్మ, జిల్లా అధ్యక్షుడు పగిడిమర్రి ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.