Attack | మియాపూర్, మార్చి 21: తనను కాదని వేరే వ్యక్తిని వివాహం చేసుకుందన్న కోపంతో ఓ మహిళపై ప్రియుడు, అతని తండ్రి కలిసి కత్తితో దాడి చేశారు. ఈ సంఘటన
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కాకినాడకు చెందిన నూకరత్నం(25)అనే మహిళ మియాపూర్లోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటూ హౌస్ కీపింగ్ పనిచేస్తుంది. గతంలోనే భర్తను కోల్పోయిన నూకరత్నానికి ఇద్దరు కూతుళ్లున్నారు.
కొంత కాలం క్రితం ప్రసాద్ అనే వ్యక్తితో నూకరత్నంకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు పరస్పర అంగీకారంతో గత నెల ఫిబ్రవరి 20న వారు వివాహం చేసుకున్నారు. ఆలీషా అలియాస్ పాండు అనే వ్యక్తి నూకరత్నం పని చేసే చోటే వంట వాడిగా పనిచేస్తున్నాడు. అయితే నూకరత్నంను ఇష్టపడ్డ ఆలీషా అలియాస్ పాండుకు ఆమె తనకు చెప్పకుండా ప్రసాద్ను పెళ్లిచేసుకోవడంతో కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలో ఆలీషా ఈ నెల 19వ తన తండ్రి లాలూ, స్నేహితుడు జాన్తో కలిసి నూకరత్నం ఇంటికి వెళ్లాడు. తనతో రావాలని నూకరత్నంతో అలీషా గొడవ పడగా.. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆలీషా తన వెంట తెచ్చుకున్న కత్తితో నూకరత్నంపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. నూకరత్నంపై దాడికి పాల్పడ్డ నిందితులు ఆలీషా, అతని తండ్రి లాలూను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

బీఆర్ఎస్తోనే మైనారిటీల సంక్షేమం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్