కామారెడ్డి టౌన్, జూన్ 21: కొత్త కలెక్టరేట్ భవనంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పడానికి అన్ని శాఖల అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డిలోని నూతన కలెక్టరేట్ కార్యాలయ సమావేశపు మందిరంలో తొలిసారిగా జిల్లా అధికారులతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆదివారం సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టరేట్లో పారిశుద్ధ్య పనుల కోసం శానిటేషన్ ఏజెన్సీని నియమిస్తామన్నారు. రెండు రోజుల్లో పాత కలెక్టరేట్లోని అన్ని కార్యాలయాలు నూతన కలెక్టరేట్లోకి మారాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్, ఎన్ఐసీ టెలిఫోన్ లైన్లు, ఇతర వసతులను వెంటనే సమకూర్చుకోవాలన్నారు. ఏడో విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. హరితహారం పనులను ప్రతిరోజూ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపారు. గృహావసరాల మొక్కలకు ముందే అనుమతి తీసుకోవాలని, గుంతలు తీసినప్పుడు మొక్కలు ఏ నర్సరీ నుంచి తేవాలనే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. హైవే పక్కన ప్లాంటేషన్ త్వరగా పూర్తిచేయాలని, ఫారెస్టు అధికారులు గుంతలను త్వరగా తీయించి అధికారులకు అప్పగించాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అధికారులందరూ కలిసి విజయవంతం చేయాలని సూచించారు.