Asaduddin Owaisi : ప్రధాని నరేంద్ర మోదీ ముస్లింలపై విద్వేష ప్రచారం సాగిస్తున్నారని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. మోదీ వ్యాఖ్యలతో దేశంలో అల్లర్లు చెలరేగితే అందుకు ప్రధాని బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రధాని తరచూ మోదీ గ్యారంటీ అంటున్నారని, మోదీ గ్యారంటీ అంటే ముస్లింలపై విద్వేషం వెదజల్లడమేనని ఓవైసీ పేర్కొన్నారు. 2002 నుంచి మోదీ ఇలాగే వ్యవహరిస్తున్నారని ఓ వార్తాసంస్ధతో మాట్లాడుతూ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. 17 కోట్ల మంది ముస్లిం జనాభాతో దేశంలో అత్యధిక మైనారిటీ కమ్యూనిటీగా ముస్లింలు ఉన్నారని ఆయన గుర్తుచేశారు.
దేశంలో 140 కోట్ల మందికి మోదీ ప్రధాన మంత్రని..ముస్లింల మనోభావాలను ఇలా గాయపరచడం ప్రధాని స్ధాయి వ్యక్తికి తగదని అన్నారు. దేశంలో రేపు అల్లర్లు చెలరేగితే అందుకు నరేంద్ర మోదీ బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ సంపదను అధిక సంతానం కలిగిన వారికి పంచేస్తారని మోదీ ఇటీవల పేర్కొన్న నేపధ్యంలో ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ఆస్తుల పున:పంపిణీ గురించి ప్రస్తావించిందని, దేశంలో వనరులపై తొలి హక్కు ముస్లింలదేనని గతంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారని ప్రధాని మోదీ ఇటీవల రాజస్ధాన్లో జరిగిన ఓ ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే కాంగ్రెస్ ప్రధాని వ్యాఖ్యలను తోసిపుచ్చింది. పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎక్కడైనా హిందూ, ముస్లిం అనే పదం రాసి ఉందనే విషయం ప్రధాని మోదీ చూపించాలని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రధాని మోదీకి సవాల్ విసిరారు.
Read More :
Vinod Kumar | ఈసారి బండికి ఓటేయొద్దని ప్రజలు నిర్ణయించుకున్నరు : వినోద్ కుమార్