Vinod Kumar : బీఆర్ఎస్ సీనియర్ నేత, కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం రోజూ రెండు పూటలా ఆయన ప్రచారం కొనసాగుతోంది. ఇవాళ ఉదయాన్నే వేములవాడ పట్టణంలో మార్నింగ్ వాకర్స్తో వినోద్ కుమార్ మాట్లాడారు. ఈ లోక్సభ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని వినోద్ కుమార్
ఆరోపించారు. మోదీ ప్రధానమంత్రిగా మత వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. మోదీ
వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిపై అనర్హత వేటు వేయాలన్నారు. ఇందిరాగాంధీ హయాంలో కూడా ‘ఇందిర అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిరా’ అనుకున్నారని, అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు.
కరీంనగర్ ప్రజలు గతంలో బండి సంజయ్కి బావోద్వేగంతో ఓట్లు వేశారని, ఐదేళ్లు ఎంపీగా ఉండి ఆయన ఐదు రూపాయలు కూడా తేలేదని వినోద్కుమార్ విమర్శించారు. అందుకే నియోజకవర్గ ప్రజలు ఈసారి సంజయ్కు ఓటు వేయొద్దని నిర్ణయించుకున్నారని చెప్పారు. గర్భిణులకు పాలు, గుడ్లు ఇస్తున్నామని బీజేపీ వాళ్లు పోస్టర్లు వేసుకున్నారని, ఆ పథకం జవహర్లాల్ నెహ్రూ అంగన్వాడీల ద్వారా అమలు చేసినప్పటి నుంచే ఉందని అన్నారు.
వంద రోజుల ఉపాధి హామీ పనులకు నిధులు ఇస్తున్నామని చెబుతున్నారని, దాని గురించి మన చట్టంలోనే ఉందని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి నలుగురు ఎంపీలు గెలిచి రాష్ట్రానికి తెచ్చిందేమీ లేదని అన్నారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి తెలంగాణ సమస్యలపై 553 సార్లు ప్రశ్నలు అడిగానని, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ సిరిసిల్ల వరకు తీసుకువచ్చానని, జాతీయ రహదారులు కూడా తీసుకువచ్చానని చెప్పారు.
బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు కనీసం ఒక నవోదయ పాఠశాల కూడా తేలేదని వినోద్ విమర్శించారు. తన హయాంలో కరీంనగర్కు రూ.1000 కోట్ల నిధులు తెచ్చినట్లు తెలిపారు. తనను పార్లమెంటుకు పంపితే తెలంగాణ ప్రజల గొంతుకై వినిపిస్తానని ఆయన చెప్పారు. గోదావరి జలాలను అచ్చంపల్లి ద్వారా తమిళనాడు తరలిస్తాం అంటున్నారని, దాంతో మనకు అన్యాయం జరుగుతుందని అన్నారు. తాను మట్టి పనికైనా మన ఊరి వాడిగా ఉంటానని అన్నారు. ప్రజలు బాగా ఆలోచించి పనిచేసే తనకు అవకాశం కల్పించాలని కోరారు.