వేల్పూర్, ఏప్రిల్ 23 : ఇచ్చిన హామీలు అమలు చేయలేని సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ సర్కారును విమర్శించడం సరికాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నా రు. రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేశారని మండిపడ్డారు. సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సభలో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వేముల ఖండించారు. గతంలో ఎర్రజొన్న రైతుల బకాయిలు ఇప్పించాలని ఆందోళన చేస్తే కాల్పులు జరిపించింది, అక్రమంగా కేసులు పెట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభు త్వం బకాయిలు ఎగ్గొడితే కేసీఆర్ ప్రభుత్వం రూ.11 కోట్ల బకాయిలు రైతులకు చెల్లించడమే కాకుండా బేషరతుగా కేసులు ఎత్తివేసిందని గుర్తుచేశారు. రైతులపై నిజమైన ప్రేమ ఉన్న నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు సిసలైనది తెస్తానని మళ్లీ మాయ మాటలు చెప్పి రైతులను దగా చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. 50 ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు పసుపు బోర్డు ఇవ్వడానికి మనసు రాని కాంగ్రెస్ .. ఎన్నికల కోసం కల్లబొల్లి మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
బోధన్ షుగర్ ఫ్యాక్టరీని సెప్టెంబర్ 17లోపు తెరిపిస్తానని మరోసారి మోసం చేయడానికి రేవంత్రెడ్డి కుట్ర పన్నుతున్నారన్నారు. ఫ్యాక్టరీ మూసివేసిందే కాంగ్రెస్ ప్రభుత్వమని, బట్టకాల్చి మీద పడేసే నీచ బుద్ధి రేవంత్రెడ్డిదన్నా రు. కేసీఆర్ పాలన రైతాంగానికి స్వర్ణయుగం లాంటిదని పేర్కొన్నారు. ఈ రోజు ఇంత గొప్ప గా రైతులు వ్యవసాయం చేస్తున్నారంటే అది కేసీఆర్ చలువ కాదా ? అని ప్రశ్నించారు. రుణమాఫీ కోసం పుట్టెడు అబద్ధాలు ఆడుతున్న రేవంత్రెడ్డికి పుట్టగతులు ఉండవన్నారు. ఓట్ల కోసం దేవుళ్లపై ప్రమాణం చేస్తూ రైతులను రేవంత్రెడ్డి మభ్యపెడుతున్నాడని, రైతులతో ఆటలాడుకున్న ఎవరు బాగు పడలేరన్నారు. ఇదే రైతులు రేవంత్రెడ్డికి రాజకీయ సమాధి కట్టే రోజులు త్వరలో వస్తాయన్నారు.
పదేండ్లు అధికారంలో ఉండి పసుపు బోర్డు సాధ్యం కాదని చెప్పిన బీజేపీ కూడా ఎన్నికల లబ్ధి కోసం పసుపు బోర్డు ఇచ్చామని ప్రధానమంత్రితో అబద్ధపు ప్రకటన చేయించిందన్నారు. అడ్రస్ లేని పసుపు బోర్డును ఆకాశంలో చూపెట్టి ఓట్లడిగే దుష్ట సంప్రదాయానికి బీజేపీ ఒడిగట్టిందని మండిపడ్డారు. బాండ్ పేపర్ గుండు అర్వింద్ అబద్ధాలు చెప్పడంలో ఆస్కార్ అవార్డు పొందాడని ఎద్దేవా చేశారు. అన్నం పెట్టే అన్నదాతలను అబద్ధాలతో మోసం చేస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు రైతుల ఉసురు తగులుతుందని తెలిపారు. పసుపు బోర్డు కోసం నాలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులను కలిసి వారి నుంచి లేఖలు తెప్పించి, కేంద్ర ప్రభుత్వానికి అందజేసి విశ్వప్రయత్నాలు చేసింది అప్పటి ఎంపీ కవిత కాదా? అని ప్రశ్నించారు. పసుపు బోర్డు ఇవ్వాల్సింది కేంద్రం, కానీ పార్లమెంట్లో పసుపు బోర్డుపై గళం ఎత్తి పోరాటం చేసిన కవితపై ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు.