Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతల ప్రసంగాలు చూస్తుంటే అసంబద్ధమైన అంశాలను లేవనెత్తడం కనిపిస్తుందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ప్రజలకు సంబంధించిన వాస్తవ అంశాలను మరుగునపరిచేందుకు కాషాయ నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేరళలోని వయనాద్లో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు మీరు ఎదుర్కొనే సమస్యలను ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ప్రస్తావించడం లేదని దుయ్యబట్టారు.
వారు అభివృద్ధి గురించి మాట్లాడరు..ప్రజల సమస్యల గురించి ప్రస్తావించారు..ప్రతి రోజూ ప్రజలకు సంబంధం లేని కొత్త అంశాలను తెరపైకి తీసుకువచ్చి గందరగోళపరుస్తారని ప్రియాంక పేర్కొన్నారు. మీ అభివృద్ధితో సంబంధం లేని, మీ బాగోగులతో సంబంధం లేని అసంబద్ధమైన విషయాలపై మాట్లాడతారని ఆమె ఆరోపించారు.
రోజురోజుకూ పెరుగుతున్న నిరుద్యోగం, ధరల మంట గురించి కాషాయ నేతలు అసలు నోరు మెదపరని మండిపడ్డారు. మీడియా మొత్తం వారు లేవనెత్తే అసంబద్ధ అంశాల చుట్టూ చర్చించేలా చూస్తూ వాటినే ఎన్నికల అంశాలుగా మలిచేందుకు ప్రయత్నిస్తారని ప్రియాంక గాంధీ ఆరోపించారు.
Read More :