Onion Export | ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నది. నిషేధం ఎత్తివేసే ముందు ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉల్లి కనీస ఎగుమతి ధర టన్నుకు 550 డాలర్లుగా నిర్ణయించింది. ఈ నోటిఫికేషన్ మే 4వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. మహారాష్ట్రలో జరుగనున్న లోక్సభ ఎన్నిక పోలింగ్కు ముందు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. నిషేధం ఎత్తివేతతో దేశంలో ధరలు పెరిగే అవకాశం ఉందనే ఊహాగానాల నేపథ్యంలో కేంద్రం స్పందించింది.
దేశంలో ఉల్లి లభ్యత ఉందని, ధరల పరిస్థితిని సంబంధిత శాఖ పర్యవేక్షిస్తుందని తెలిపింది. గతంలో ఉత్పత్తి తగ్గుతుందన్న ఆందోళన నేపథ్యంలో రిటైల్ ధరలను నియంత్రించేందుకు గతేడాది డిసెంబర్ 8న కేంద్రం ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. గత నాలుగైదు ఏళ్లు దేశంలో ఏటా 17లక్షల నుంచి 25లక్షల టన్నుల వరకు ఉల్లిపాయలు ఎగుమతి అవుతున్నాయి. వినియోగదారుల వ్యవహారాలశాఖ నిధి ఖరే మాట్లాడుతూ నిషేధం ఎత్తివేతతో రిటైల్ మార్కెట్లు ధరలు పెరగవని, స్థిరంగానే ఉంటాయని చెప్పారు. ఏదైనా పెరుగుదల ఉంటే.. చాలా తక్కువగానే ఉంటుందని.. వినియోగదారులు. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.