సిమ్లా: నటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన కంగనా రనౌత్ (Kangana Ranaut ) ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ను లక్ష్యంగా చేసుకోవాలని భావించారు. అయితే కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై మాటల దాడి చేశారు. వారిద్దరి తొలి పేరు తేజస్వీగా ఉండటంతో ఆమె పొరపాటున సొంత పార్టీ నేతను విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా రనౌత్, శనివారం సుందర్నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఆర్జేడీపై విమర్శలు గుప్పించారు. ‘చెడిపోయిన ‘షెహజాదా’ల (యువరాజుల) పార్టీ ఉంది. ఎక్కడికి వెళ్లాలో వారికే తెలియదు. చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలనుకుంటున్న రాహుల్ గాంధీ అయినా, గూండాయిజం చేసి చేపలు తినే తేజస్వి సూర్య అయినా’ అని ఆమె అన్నారు.
కాగా, కంగనా రనౌత్ మాట్లాడిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ దీనిపై స్పందించారు. ఈ వీడియో క్లిప్ను ఎక్స్లో ఆయన షేర్ చేశారు. ఈ మేడమ్ ఎవరు? అని అందులో ప్రశ్నించారు.
ये मोहतरमा कौन है? https://t.co/RvTfHjm26I
— Tejashwi Yadav (@yadavtejashwi) May 4, 2024