BRS Party | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా అధినేత కేసీఆర్ 119 నియోజక వర్గాలకు ఇంచార్జీలను ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఇంచార్జీలతోపాటు ప్రతీ నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున ఐటీ నిపుణులతో కలిపి తెలంగాణ భవన్లో డిజిటల్ శిక్షణ ఇవ్వబడుతుంది. ఇప్పటికే ప్రకటించిన మేరకు సభ్యత్వ నమోదుకు సంబంధించిన డిజిటల్ యాప్ మెరుగులు దిద్దుకుంటున్నది. త్వరలో తుది రూపం తీసుకోనున్నది.
తెలంగాణ భవన్లో శిక్షణ అనంతరం, వీరు బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఇప్పటికే నియమించబడిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇంచార్జీల ఆద్వర్యంలో అన్ని నియోజకవర్గాల వారీగా ఆయా జిల్లా పార్టీ కార్యాలయాలలో శిక్షణ శిభిరాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఆయా నియోజకవర్గంలో వున్న బూత్ ల సంఖ్యను బట్టి బూత్కు ఇద్దరు చొప్పున నిర్ణయించిన తేదీ నుంచి వారం రోజుల పాటు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా శిక్షణకు హాజరైన వారికి భోజన వసతులు కల్పించబడతాయి. ఈ ప్రక్రియలో రాష్ట్ర కమిటీ నుంచి నియమించబడిన ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇంచార్జుల ఆధ్వర్యంలో ఈ మొత్తం వ్యవహారాలను, ఆయా జిల్లాల వారీగా నిర్వహించబడుతుంది. ఈ మొత్తం డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తయిన వెంటనే సభ్యత్వ నమోదు తేదీని ప్రకటిస్తారు.
ప్రకటించిన తేదీ రోజు స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్తో సహా పార్టీ ముఖ్యులంతా సభ్యత్వ పునరుద్దరణ కార్యక్రమంలో పాల్గొంటారు. తద్వారా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ పునరుద్దరణ, నమోదు ప్రక్రియ మొదలవుతుంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉండేటటువంటి అన్ని రకాల కమిటీలకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తారు. ప్రకటించబడిన నిర్ణీత తేదీలలో కమిటీల నియామకం పూర్తి చేసుకుని పార్టీ శిక్షణా శిబిరాలు నిర్వహించబడతాయి.